మాస్‌ మహారాజా రవితేజ తన కొత్త సినిమాని ప్రకటించారు. ఉగాది పండుగని పురస్కరించుకుని కొత్త మూవీ విశేషాలను వెల్లడించారు. అవి క్రేజీగా ఉండటం విశేషం.  

మాస్‌ మహారాజా రవితేజ జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. జెట్‌ స్పీడ్‌తో ఆయన మూవీస్‌ పూర్తి చేస్తూ జోరుమీదున్నాడు. కానీ సరైన హిట్లు పడటం లేదు. ఎంతో నమ్మకం పెట్టుకున్న `ఈగల్‌` మూవీ డిజప్పాయింట్‌ చేసింది. ఇక ప్రస్తుతం `మిస్టర్ బచ్చన్` సినిమా చేస్తున్న మాస్‌ మహారాజా తాజాగా కొత్త సినిమాని ప్రకటించారు. ఉగాది పండుగని పురస్కరించుకుని ఈ కొత్త మూవీని ప్రకటించారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. 

సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ మూవీస్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీని ప్రకటిస్తూ సినిమా కాన్సెప్ట్, రవితేజ పాత్ర తీరుతెన్నులను వెల్లడించారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది రవితేజ నటిస్తున్న 75వ మూవీ కావడం విశేషం. ఈ పోస్టర్‌లో రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద 'RT 75' అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద `రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి`, `హ్యాపీ ఉగాది రా భయ్` అని తెలంగాణ యాసలో రాయడం ఆస్తకిని క్రియేట్‌ చేస్తుంది. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. 

ఈ మూవీలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని తెలపడంతోపాటు ఆయన పాత్ర ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. `ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో` అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు చాలా కొత్తగా ఉంది. సినిమా కంటెంట్ కూడా కొత్తగా ఉండబోతుందనే సందేశాన్నిస్తుంది. పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. 

Scroll to load tweet…

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం "ధూమ్ ధామ్ మాస్" దావత్ అని మేకర్స్ పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్‌ కాబోతుందని చెప్పొచ్చు.