`క్రాక్` రిలీజ్ ఆపమంటూ కోర్టుకు
రవితేజ రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. ఇప్పడీ చిత్రం లీగల్ సమస్యల్లో ఇరుక్కుంది.
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన చిత్రం`క్రాక్`. ‘డాన్శీను, బలుపు’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న `క్రాక్` సినిమా సంక్రాంతి 2021 రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే అనుకోని విధంగా ఇప్పుడు ఈ సినిమా ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ కోర్టుకు వెళ్లటంతో లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సినిమా రిలీజ్ అపేలా స్టే ఇవ్వాలని ఆ డిస్ట్రిబ్యూటర్ కోరినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం నిర్మాత ఠాగూర్ మధు గతంలో విశాల్ తో అయోగ్య (టెంపర్ రీమేక్) చేసారు. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన స్క్రీన్ సీన్ మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీవారు కోర్ట్ కు ఎక్కారు. తమకు ఇవ్వాల్సిన బాకీలు సెటిల్ చేయకుండా ఠాగూర్ మధు కొత్త సినిమా క్రాక్ రిలీజ్ చేయకుండా ఆపాలని కోరారు. దాంతో ఇప్పుడు బాల్ కోర్ట్ లో ఉంది. కోర్ట్ స్టే ఇస్తుందా లేదా చూడాలి. లేకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్ తో నిర్మాత సెటిల్ చేసుకున్నా సమస్య ఉండదు.
మరో ప్రక్క థియోటర్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం జీటీవి గ్రూప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి చర్చలు జరిపింది. నిర్మాతలతో దాదాపు డీల్ పైనల్ అయ్యిందనుకున్న టైమ్ లో జీ టీవి వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. కారణాలు ఏంటనేది తెలియరాలేదు. దాంతో ఇప్పుడు నిర్మాతలు వేరే శాటిలైట్ ఛానెల్స్ తో శాటిలైట్,డిజిటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్యన టీవీల్లో వచ్చిన సాహో,భీష్మ సినిమాలు టీఆర్పీ పరంగా భారీ దెబ్బ కొట్టడంతో ఈ సినిమా రైట్స్ తక్కువ రేటుకు అడుగుతున్నట్లు వినపడుతోంది.
మరో ప్రక్క 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నిర్మాతలు ప్రకటించారు. చిత్రం షూటింగుకు సంబంధించి ఒక పాట షూటింగ్ మినహా అంతా పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయనీ పేర్కొన్నారు.ఈ చిత్రంలో వరలక్షీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న క్రాక్ చిత్రంలో రవితేజతో శృతిహాసన్ రొమాన్స్ చేయనుంది. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్స్ స్టోరీతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చిత్రం టీమ్ చెబుతోంది. తమిళ నటులు సమద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిల్మ్ డివిజన్పై బి మధు నిర్మిస్తోన్న చిత్రానికి తమన్ సంగీతం, జికె విష్ణు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.