వర్మ పైత్యం చూడండి... అట్టర్ ప్లాప్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తాడట!
వర్మ ఏం చేసినా నలుగురు మాట్లాడుకోవాల్సిందే. ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అట్టర్ ప్లాప్ మూవీ విడుదల చేస్తా అంటున్నాడు.
టాలీవుడ్ లో రీ రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బర్త్ డే కానుకగా పోకిరి, ఒక్కడు చిత్రాలు రీరిలీజ్ చేశారు. అలాగే పవన్ అభిమానులు ఆయన బర్త్ డే నాడు జల్సా, తమ్ముడు చిత్రాలు రీరిలీజ్ చేశారు. సదరు చిత్రాలకు భారీ స్పందన దక్కింది. అలాగే బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి మూవీ విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ చేశారు. చెన్నకేశవ రెడ్డి యూఎస్ లో పోకిరి, జల్సా రికార్డ్స్ బద్దలు కొట్టి ఆల్ టైం రీరిలీజ్ రికార్డు నమోదు చేసింది.
ఈ క్రమంలో వర్మకు తన పాత చిత్రాలు రీరీలీజ్ చేసుకొని డబ్బులు సంపాదించాలన్న ఆశ కలిగింది. అయితే ఆయన ఎంచుకున్న చిత్రమే నిరాశపరిచింది. 2009లో విడుదలైన అడవి చిత్రాన్ని వర్మ రీరిలీజ్ చేస్తున్నారు. నితిన్, నిషా కొఠారి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు వర్మ తెరకెక్కించిన అడవి అట్టర్ ప్లాప్ అని చెప్పాలి. దీన్ని హిందీలో అగ్యాత్ అనే టైటిల్ తో విడుదల చేశారు. రెండు భాషల్లో ఈ చిత్రం ఫెయిలైంది. అక్టోబర్ 14న అడవి చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు వర్మ అధికారిక ప్రకటన చేశారు.
వర్మ తన కెరీర్ లో శివ, సత్య, రంగీలా, సర్కార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. వాటిని కాదని ఒక అట్టర్ ప్లాప్ చిత్రాన్ని రీరిలీజ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. జంగిల్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎవరు చూస్తారో చూడాలి. ఇటీవల వర్మ క్లైమాక్స్ చిత్రాన్ని యూట్యూబ్ లో ఫ్రీగా విడుదల చేశారు. మియా మాల్కోవా నటించిన ఆ అడల్ట్ కంటెంట్ మూవీకి ఓ మోస్తరు ఆదరణ దక్కింది.