అలా తీస్తే ఎవరూ చూసేవారు కాదు.. 'మహర్షి'పై వర్మ కామెంట్స్!
మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి 'మహర్షి' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.
మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి 'మహర్షి' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం నాడు ప్రెస్ మీట్ ని నిర్వహించాడు వర్మ. తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో 'మహర్షి'కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై మాట్లాడిన వర్మ తనకు రైతుల కష్టాల గురించి తెలియదని, తాను ఎప్పుడూ పొలానికి వెళ్లలేదని చెప్పారు.
మహేష్ బాబు లేకుండా 'మహర్షి' సినిమా తీసుంటే ఎవరూ చూసేవారు కాదని వర్మ అన్నారు. రైతుల గురించి ఎన్నో సినిమాలు వస్తున్నా.. ఈ సినిమాను జనాలు ఆదరించడానికి కారణం మహేష్ బాబే అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఏపీలో ఈ సినిమా విడుదలైతే నిజాలు ఎక్కడ బయటపడతాయోనని సినిమా విడుదల కాకుండా ఆపేశారని వర్మ అన్నారు.
సైకిల్ టైర్ పంచర్ అయిందని, అందుకే కారులో ఇక్కడకి వచ్చామని వర్మ సెటైర్ వేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.