`ది కాశ్మీర్‌ ఫైల్స్`.. చిన్నగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు విశేష ఆదరణతో దూసుకుపోతూ భారీ సినిమాగా మారిపోయింది. ఏకంగా ఐదు రోజుల్లోనే 60కోట్లు వసూలు చేయడం విశేషం.

ఇటీవల విడుదలైన `ది కాశ్మీర్‌ ఫైల్స్` సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్‌ పండిట్లపై జరిగిన హత్యాకాండకి సంబంధించిన అంశాలను దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఈ సినిమాలో ఆవిష్కరించారు. చిన్నగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు విశేష ఆదరణతో దూసుకుపోతూ భారీ సినిమాగా మారిపోయింది. ఏకంగా ఐదు రోజుల్లోనే 60కోట్లు వసూలు చేయడం విశేషం. `రాధేశ్యామ్‌` కంటే ఈ సినిమాకి కలెక్షన్లు బాగా ఉండటం మరో విశేషం. 

ఈ సినిమా గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. అభినందించారు. అనేక సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. వివాదాస్పద, సంచలన అంశాలను కథలుగా తీసుకుని ఇటీవల కాలంలో సినిమాలు చేస్తూ తాను సంచలనంగా మారుతున్న వర్మ.. ఇప్పుడు `ది కాశ్మీర్‌ ఫైల్స్` సినిమాపై చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. 

ఈ సందర్భంగా వర్మ చెబుతూ,  దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిపై ప్రశంసలు కురిపించారు. ఒక టార్చ్ బేరర్‌గా వర్ణించడం విశేషం. `ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కంటే సత్యాన్ని వెలికితేసే మరింత శక్తివంతమైన సాధనంగా సినిమాని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని దర్శకుడు `ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రం ద్వారా చూపించారు. ఈ విషయంలో ఆయనొక టార్చ్ బేరర్‌గా నిలిచారు` అని ప్రశంసించారు. 

ఇంకా చెబుతూ, కత్తి కంటే కలం శక్తివంతమైనదనే పాత సామెతని వివేక్‌ అగ్నిహోత్రి తారుమారు చేస్తూ పెన్‌, స్వార్డ్(కత్తి) కంటే సినిమా శక్తివంతమైనదని నిరూపించారు. అంతేకాదు సాహిత్యపరంగానూ, కమర్షియల్‌గానూ సినిమాల పరంగానూ ప్రతి నియమాన్ని దర్శకుడు `ది కాశ్మీర్‌ ఫైల్స్` సినిమా విషయంలో ఉల్లంఘించారు. నాటకీయత లేని స్క్రీన్‌ప్లే, మామూలు కాస్టింగ్‌, తొందరపెట్టని ఎడిటింగ్‌ వంటి వాటిని ఉపయోగించి ఈ చిత్రాన్ని మరింత కమర్షియల్‌గా తెరకెక్కించారు.

Scroll to load tweet…

ఇండియాలోని ప్రతి ఫిల్మ్ మేకింగ్‌ టీమ్‌లో,ఫిల్మ్ మేకర్స్ తమ తదుపరి సినిమా చేయడానికి ముందు `ది కాశ్మీర్‌ ఫైల్స్` సినిమా దృగ్విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్‌లో వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి సినిమాని అనుసరించడం ద్వారా నిజాలను తవ్వడానికి, భద్రపరచడానికి ప్రధాన వనరులు అవుతాయనే నమ్మకం నాకు వెయ్యి శాతం ఉంది` అని చెప్పారు.

కశ్మీర్‌ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. వివేక్‌ అగ్రిహోత్రి దర్శకత్వం వహించగా, అభిషేక్‌ అగర్వాల్‌, పల్లవి జోషి, వివేక్‌ అగ్నిహోత్రి నిర్మించారు. అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది.విశేష ఆదరణతో దూసుకుపోతుంది.