రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీ(RC15)పై క్లారిటీ ఇచ్చారు దిల్‌రాజు.  ఇప్పటికే రెండు షెడ్యూల్‌ పూర్తయ్యాయని తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని స్పష్టం చేశారు.

రామ్‌చరణ్‌ ఈ సంక్రాంతికి మిస్‌ అయ్యాడు. ఆయన నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో వాయిదా వేశారు. ఇప్పుడు మిస్‌ అయ్యినా వచ్చే ఏడాది మిస్‌ కాదంటున్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన సోదరుడి కుమారుడు ఆశిష్‌ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు `రౌడీబాయ్స్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తుంది. `హుషారు` ఫేమ్‌ హర్ష దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు(జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆశిష్‌రెడ్డితో కలిసి దిల్‌రాజు ముచ్చటించారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ, రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీ(RC15)పై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రెండు షెడ్యూల్‌ పూర్తయ్యాయని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టాక మరో షెడ్యూల్‌ స్టార్ట్ చేస్తామన్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఈ సంక్రాంతికి `ఆర్‌ఆర్‌ఆర్‌`తో సంక్రాంతి సీజన్‌ మిస్‌ అయిన చరణ్‌ వచ్చే సంక్రాంతికి మాత్రం మిస్‌ కాకుండా వస్తాడని దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. 

ఇక తనయుడు ఆశిష్‌ రెడ్డి గురించి, ఆయన నటించిన `రౌడీబాయ్స్` సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు దిల్‌రాజు. చిన్నప్పటి నుంచే ఆశిష్‌కి సినిమాలంటే ప్యాషన్‌ అని, హీరో కావాలి కలలు కన్నాడని తెలిపారు. తాము సినిమా షూటింగ్‌లు నిర్వహిస్తున్న సమయంలో తను హీరో అవుతానని ఎప్పుడూ మాతో అంటుండేవాడని, దిల్‌రాజ్‌ వైఫ్‌ కూడా ఆశిష్‌ని హీరో చేయాలని కోరుకుందని తెలిపారు. హీరో కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలంటే బాగా లావుగా ఉన్న తను కష్టపడి దాదాపు 25కేజీలు తగ్గి సన్నబడ్డాడని, అప్పుడు ఆశిష్‌పై నమ్మకం ఏర్పడిందన్నారు దిల్‌రాజు. 

తనకు ఇండస్ట్రీలో ఉన్న పేరుతో స్టార్‌ డైరెక్టర్‌తో సినిమా లాంచ్‌ చేయోచ్చు, కానీ తాను ఎలా కిందస్థాయి నుంచి ఎదిగానో, అలానే ఆశిష్‌ కూడా ఎదగాలని కోరుకుంటున్నానని, ఆడియెన్స్ కి నెమ్మదిగా రీచ్‌ కావాలని, ఆ తర్వాత స్వతహాగా అతను హీరోగా ఎదగాలను కోరుకుంటున్నట్టు చెప్పారు దిల్‌రాజు. ఆశిష్‌కి చిన్నప్పటి నుంచే డాన్సులిష్టమన్నారు. బన్నీ అందుకు స్ఫూర్తి తో డాన్సులు నేర్చుకున్నట్టు తెలిపారు. కొడుకైనా అతను హీరో అని, అందుకు రెమ్యూనరేషన్‌ కూడా ఇచ్చానని తెలిపారు దిల్‌రాజు. `రౌడీబాయ్స్` చిత్రానికిగానూ ఆశిష్‌కి 11లక్షలు చెక్‌ ఇచ్చానని తెలిపారు. 

మరోవైపు మారుతున్న కాలాన్ని బట్టి, ట్రెండ్‌ని బట్టి తాను కూడా మారుతున్నట్టు తెలిపారు దిల్‌రాజు. తమ ఎస్‌వీసీ బ్యానర్‌లో వల్గారిటీ లేని మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ చిత్రాలు మాత్రమే తీశానని, కానీ ఇప్పుడు కాలం మారిందని, యూత్‌ఫుల్‌ సినిమాలు చాలా వస్తున్నాయని, దానికి తగ్గట్టుగా మనం కూడా మారాలని తెలిపారు దిల్‌రాజు. అందుకు `రౌడీబాయ్స్` నుంచే మార్పుని స్టార్ట్ చేసినట్టు చెప్పారు. ఇందులో లిప్‌ లాక్‌ సీన్‌ పెట్టడానికి కూడా అదో కారణమన్నారు. ఇకపై తన బ్యానర్‌లో వచ్చే సినిమాలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, యూత్‌ఫుల్‌గా కూడా ఉంటాయన్నారు.