Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుని పొగుడుతూ స్పీచ్, రజనీ ‘జైలర్‌’కు సమస్యలు?

 ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తోందని, రాజకీయం మాట్టాడొద్దని అనుభవం చబుతోందని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని..

Rajinikanth unnecessarily invited trouble for #JAILER?
Author
First Published Apr 29, 2023, 7:37 AM IST


సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కు తమిళనాట ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అదే స్దాయిలో ఉందనేది కాదనలేని సత్య.  తమిళంలో ఆయన సినిమాలకు రిలీజ్ టైమ్ లో ఎలాంటి సెలబ్రెషన్స్‌ జరుగుతాయో.. ఇక్కడ కూడా అదే రేంజ్‌లో  చేస్తూంటారు. రజనీ సినిమా కోసం ప్రేక్షకులే కాదు సెలెబ్రిటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అయితే  గత కొంతకాలంగా రజనీ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న స్థాయిలో వర్కవుట్ కావటం లేదు.  ‘రోబో’రజనీకు ఆ స్థాయి హిట్టు పడలేదు.  బాగా హైప్‌తో రిలీజైన ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు ఓకే అనిపించుకున్నాయి. కానీ ఒరిజనల్  రజనీ  సినిమా స్థాయిలో హిట్టవ్వలేకపోయాయి.  దాంతో ప్రస్తుతం రజనీకాంత్‌ ఆశలన్నీ ‘జైలర్‌’ సినిమాపైనే ఉన్నాయి. తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కు భారీ సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ ఇచ్చిన స్పీచ్ ఆంధ్రాలో రిలీజ్ కు సమస్యలు తెచ్చిపెడుతుందంటున్నారు విశ్లేషకులు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ ..చంద్రబాబు గురించి ఓ రేంజిలో   చెప్పారు.   

రజనీ మాట్లాడుతూ..‘జ్ఞానం చెప్తుంది ఏం మాట్లాడాలని. సమర్థత చెప్తుంది ఎలా మాట్లాడాలని. సభ చెప్తుంది ఎంత సేపు మాట్లాడాలని.అనుభవం చెప్తుంది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని. ఈ సభకు హాజరై జనాలు, జెండాలు చూసినపుడు రాజకీయం మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ అనుభవం మాత్రం వద్దురా రజినీ.. వద్దు.. జాగ్రత్త! రాజకీయం ఇక్కడ మాట్లాడొద్దని చెప్తోంది. కానీ మన ఆప్తుడు, రాజకీయ నేత చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటే కొద్దిగైనా ఆయన గురించి రాజకీయాలు మాట్లాడకుంటే సభా మర్యాద కాదు. కొద్దిగా రాజకీయం మాట్లాడితే కూడా పత్రికలు అదీ ఇది కలిపి రాయకండి’ అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, చంద్ర బాబు ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసని అన్నారు. హైదరాబాద్‌ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని అన్నారు. ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్ సందర్శించాను , నేను హైదరాబాద్‌లో ఉన్నానా.. న్యూ యార్క్‌లోనా అనిపించింది అని రజనీకాంత్ అన్నారు. 2024లో చంద్రబాబు గెలిస్తే దేశంలో ఎపి నెంబర్ వన్ అవుతుందన్నారు. ఎన్‌టిఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుందని చెప్పారు.

ఎన్‌టిఆర్ యుగపురుషుడని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆరేడేళ్ళ వయసులోనే పాతాళభైరవి సినిమా చూశానని, లవకుశ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎన్‌టిఆర్‌ను చూశానని ఆయనన్నారు. తను కండక్టర్ అయ్యాక ఎన్‌టిఆర్‌ను అనుకరించి నటించానని చెప్పుకొచ్చారు. ఎన్‌టిఆర్ లా మేకప్ వేసుకొని ఫొటో దిగి నా స్నేహితుడికి చూపించాను, నేను కోతిలా ఉన్నానని నా స్నేహితుడు అన్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు. 

అయితే సినిమాల గురించి రజనీ చెప్పింది ఎవరికీ సమస్య లేదు కానీ ...చంద్రబాబు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు దేశం అభిమానులు ...రజనీ స్పీచ్ ని షేర్ చేస్తూ మెచ్చుకుంటూంటే ఇది జగన్ అభిమానులకు మండుతోంది. అలాగే కొందరు మరో అడుగు ముందుకేసి గతంలో పవన్ సినిమాలకు జరిగినట్లు ..రజనీ సినిమాలు కూడా ఆంధ్రతాలో ఇబ్బందులు ఎదురౌతాయని అంటున్నారు. అయితే అంత సీన్ ఉండదు..రజనీ సినిమాల జోలికి ఎవరు రారు అని అని కొందరు సపోర్ట్ ఇస్తున్నారు. ఏదైమైనా ఓ పార్టీ తరుపున రజనీ మాట్లాడుకుండా ఉండాల్సింది అని ట్రేడ్ అంటోంది. రేపు జైలర్ సినిమా రైట్స్ తీసుకున్న వాళ్లపై ఈ ఇంపాక్ట్ పడితే సమస్యే కదా అని చెప్తున్నారు. 

ఇక జైలర్ విషయానికి వస్తే..‘బీస్ట్‌’ వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత నెల్సన్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాలో రజనీ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios