సినిమాలపై ఫోకస్ షిఫ్ట్ చేసిన రజనీ.. నేటి నుంచి కోల్కత్తాలో
ఇకపై తన ఫోకస్ మొత్తం సినిమాలపై పెట్టబోతున్నాడు రజనీ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాని త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఇకపై తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. తాను ఏర్పాటు చేసిన `రజనీ మక్కల్ మండ్రం` పార్టీని రద్దు చేశాడు. ఇటీవల అమెరికా వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగొచ్చిన రజనీ అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పొలిటికల్ ఎంట్రీపై చర్చించారు. ఎట్టకేలకు తన పార్టీని రద్దు చేస్తూ ఇకపై దాన్ని అభిమాన సంఘంగా మార్చుతున్నట్టు ప్రకటించారు. దీంతో రజనీ రాజకీయ ఎంట్రీకి సంబంధించిన అనేక సందేహాలకు పుల్స్టాప్ పెట్టినట్టయ్యింది.
ఇకపై తన ఫోకస్ మొత్తం సినిమాలపై పెట్టబోతున్నాడు రజనీ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాని త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం రజనీ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, కీర్తిసురేష్, ఖుష్బు, మీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ని తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ని కోల్కత్తాలో ప్లాన్ చేశారట.
బుధవారం నుంచి ఈ సినిమా షెడ్యూల్ని కోల్కత్తాలో చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుందట. ఈ చివరి షెడ్యూల్ కోసం ఇప్పటికే రజనీతోపాటు ఇతర ప్రధాన తారాగణం, టెక్నీషియన్లు కోల్కతా చేరుకున్నట్టు సమాచారం. ఇక సినిమా త్వరగా పూర్తి చేసి దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు. గతేడాది సంక్రాంతికి `దర్భార్`తో వచ్చారు రజనీ. ఆ సినిమా మిశ్రమ స్పందన రాబట్టుకుంది.