తనకు ప్రత్యేక గౌరవం ఇచ్చి... గోల్డెన్ టికెట్ ద్వారా ఆహ్వానించినందకు తలైవా స్పందించారు. ప్రత్యేకంగా ట్వీట్ చేసిన సూపర్ స్టార్ ఏమన్నారంటే...?
తనకు ప్రత్యేక గౌరవం ఇచ్చి... గోల్డెన్ టికెట్ ద్వారా ఆహ్వానించినందకు తలైవా స్పందించారు. ప్రత్యేకంగా ట్వీట్ చేసిన సూపర్ స్టార్ ఏమన్నారంటే...?
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలో వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ నిర్వహణను బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈక్రమంలోనే క్రికెట్కు మరింత ప్రచారం తీసుకువచ్చి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా భారతదేశంలో ప్రముఖులకు గోల్డెన్ టికెట్ను అందిస్తోంది. సినిమా రంగంతో పాటు, క్రికెట్ రంగం, ఇతర సెలబ్రిటీలకు ఈ టికెట్ ఇస్తూ వస్తున్నారు.
అయితే మొదటి గోల్డెన్ టికెట్ను బీసీసీఐ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఇవ్వగా రెండో టికెట్ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు అందజేశారు. మంగవారం సూపర్ స్టార్ రజినీకాంత్ను కలిసిన బీసీసీఐ సభ్యులు జై షా ఆయనకు మూడో గోల్డెన్ టికెట్ను అందజేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు రజినీకాంత్ దీనిపై స్పందించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ టికెట్ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
అంతే కాదు ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. బీసీసీఐకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషాను కలవడం ఆనందంగా ఉందని, ఆప్యాయతతో కూడిన మీ మాటలు, ఆలోచనలకు ధన్యవాదాలు అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు. ఇక గోల్డెన్ టికెట్ అందుకున్నవారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఈ టికెట్ ఉన్నవారు ప్రపంచకప్లోని అన్ని మ్యాచులను వీఐపీ స్టాండ్ నుంచి ఉచితంగా చూడొచ్చు. ప్రపంచకప్ ప్రారంభమయ్యే లోపు మరికొంత మందికి బీసీసీఐ గోల్డెన్ టికెట్ను ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న ఆడనుంది.