సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ గురించి చేసిన కామెంట్ వివాదం మరువకముందే మరో సారి నోరు జారారు. ఇక ఈ విషయంలో నటకిరీటి స్పందన ఏంటంటే?

ప్రతీసారి ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం రాజేంద్ర ప్రసాద్ కు అలావాటుగా మారింది. ఏదోఒక మాట అనడం అనుకోకుండా జరిగిందంటూ కవర్ చేయడం, దాంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఇలా చాలాసార్లు జరిగింది.. ఇంకా జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మారోసారి నోరు జారి మాటలు అన్నారు రాజేంద్రప్రసాద్. ప్రముఖ నటులను బూతులు తిట్టడం, దాన్ని కవర్ చేసుకునేలా మరికొన్ని డైలాగ్స్ వేయడం వివాదాస్పందం అయ్యింది.

మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన రాజేంద్రప్రసాద్, స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో కామెడీ నటుడు అలీని ఉద్దేశించి అనుకోకుండా ఓ బూతుపదం ఉపయోగించారు. “మనమంతా ఇలానే మాట్లాడుకుంటాం కదా” అంటూ మిగతా వారిని చూస్తూ వ్యాఖ్యానించారు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా అలీని ఆయన అన్న పదం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పుడు ఎవరు మాట్లాడకపోయినా.. సోషల్ మీడియాలో జనాలు మాత్రం వదలకుండా వెంటపడిమరీ ట్రోల్ చేశారు.

తాను చేసిన వాఖ్యలపై వివరణ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా రాజేంద్రప్రసాద్ స్పందించారు. హైదరాబాద్‌లో తను నటించిన షష్టిపూర్తి సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను అందరితో సరదాగా ఉంటాను . వాళ్లు నాతో అలాగే ఉంటారు. ఇటీవల కొన్ని ఈవెంట్స్‌లో నేను గబాల్న ఫ్లోలో అనేసిన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ సంస్కారం. నేనేంటో అందరికి తెలుసు. ఫ్లోలో అన్న మాటలను తప్పుగా తీసుకోవడం మీ అభిప్రాయం,” అని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో తనదైన శైలిలో వివరణ ఇచ్చిన రాజేంద్రప్రసాద్, ఆ వ్యాఖ్యల వెనుక ఎటువంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం సినిమారంగంలో సంచలనంగా మారింది.నెటిజన్లు మాత్రం వదలకుండా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. కొంత మంది అయితే డైరెక్టర్ గా బూతులు తిట్టేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.

రాజేంద్ర ప్రసాద్ షష్టిపూర్తి సినిమా సక్సెస్ మీట్.

రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ మీద రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.

షష్టిపూర్తి’ అనేది కల్చరల్ బ్లాక్ బస్టర్ కాదు.. కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు దక్కింది. మీడియా, ఆడియెన్స్ వల్లే మా ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ స్థాయి వరకు వచ్చింది. థియేటర్లో అందరూ చూసి ఏడ్చేస్తున్నారంటేనే మేం సక్సెస్ అయినట్టు. ‘లేడీస్ టైలర్’లో నేను చాలా అల్లరి చేశాను. ‘ఆ నలుగురు’ చూసి నన్ను రఘురాం అని అన్నారు. అదే పాత్ర తాలుకా గొప్పదనం. మన కంటే మన పాత్రలే గుర్తుంటాయి, ఈ విషయాన్ని అన్న ఎన్టీ రామారావు గారు చెబుతుండేవారు అని అన్నారు.

తల్లిపేరును తన పేరుగా మార్చుకున్న దర్శకుడు

అంతే కాదు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘లేడీస్ టైలర్’ తరువాత అర్చనను మళ్లీ ఇంత వరకు చూడలేదు. మాతో ఇలాంటి ఓ గొప్ప సినిమాను పవన్ ప్రభ చేశారు. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు. నిజానికి ఈ దర్శకుడి పేరు పవన్ కుమార్, కాని అతని అమ్మ చనిపోయాక ఆ పేరుని మార్చుకుని పవన్ ప్రభ అని పెట్టుకున్నారు. అమ్మ మీద అంత ప్రేమ ఉంది కాబట్టే ఇంత మంచి కథను రాసుకున్నారు.. అదే ఇప్పుడు కల్ట్ సినిమాగా మారింది.

‘షష్టిపూర్తి’ చేసి తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి.. ఎంతలా గౌరవించాలో, ప్రేమించాలో చూపించారు. ఇలాంటి చిత్రాలెన్నో ఇంకా రావాలి. విజయ వాహినీ, ఏవీఎం స్టూడియో వంటి ఎన్నో గొప్ప ప్రొడక్షన్ కంపెనీల్లో పని చేసిన అనుభవంతో నిర్మాతగా రూపేశ్ గొప్ప స్థాయికి వెళ్తాడని చెబుతున్నాను. ఇలాంటి అద్భుతమైన పాత్రలు నా చివరి శ్వాస వరకు చేయాలని కోరుకుంటూనే ఉంటాను. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.