గౌతమిపుత్ర శాతకర్ణి మూవీపై రాజమౌళి ప్రసంశల జల్లు అద్భుత కావ్యమని కితాబిచ్చిన జక్కన్న

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. 'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12 కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని కొనియాడారు. రచయిత సాయిమాధవ్‌ సంభాషణలు, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తెలుగు చిత్రాల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు. 

కాగా, బాలకృష్ణ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగానే గురువారం ఉదయం 5.15గంటలకు కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లో బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ షోకి బాలయ్యతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, క్రిష్, నటుడు నారా రోహిత్ హాజరయ్యారు. 

తెలుగు వాడి ప్రతిభను చాటే చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కింది. ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్థరాత్రి నుండే టిక్కెట్ల కోసం అభిమానులు థియేటర్స్ దగ్గర క్యూ కట్టారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌ని చిరు ఫుల్‌ఎంటర్‌టైన్ చేయగా, నందమూరి అభిమానులను బాలయ్య మరింత అలరిస్తాడని చెప్పుకుంటున్నారు.