ఈ బాలీవుడ్ సినిమా కథ అచ్చం మగధీర కథలానే ఉందే

అప్పటిలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మగధీర. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లో చాలా మంది రీమేక్‌ చేయాలని చూసారు. హృతిక్‌ రోషన్‌ మొదట్లో ఆసక్తి చూపించినా సరైన దర్శకుడు దొరక్క డ్రాప్‌ అయ్యాడు. తర్వాత షాహిద్‌ కపూర్‌తో రీమేక్‌ చేద్దామనుకున్నారు. అదీ కుదర్లేదు. 

ఇక మగధీర డ్రాప్‌ అయినట్టే అనుకుంటూ వుండగా 'రాబ్తా' అనే కొత్త సినిమా ట్రెయిలర్‌ తెలుగు సినీ ప్రియులకి స్వీట్‌ షాకిచ్చింది. 'ధోని' ఫేమ్‌ సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ట్రెయిలర్‌ చూస్తే ఇది 'మగధీర'కి కాపీ అని ఇట్టే తెలిసిపోతుంది. పునర్జన్మలు, గత జన్మలో యుద్ధాలు వగైరా అన్నీ ఇందులో కవర్‌ చేసారు. కాకపోతే బాలీవుడ్‌ స్టయిల్‌కి తగ్గట్టు మోడ్రన్‌ లవ్‌స్టోరీని ముద్దులతో నింపేసారు. 

అలాగే గత జన్మని కూడా రాజుల నేపథ్యంలో కాకుండా ఒక విధమైన ట్రైబల్స్‌ మధ్య పోరులా చూపించారు. ఏదైతేనేం మగధీర కథని తీసుకుని అటు తిప్పి, ఇటు తిప్పి బాలీవుడ్‌కి కావాల్సినట్టుగా వంటకం రెడీ అయిపోయింది. 

ఇందులో 'నేనొక్కడినే' ఫేమ్‌ క్రితి సనన్‌ హీరోయిన్‌గా నటించింది. మరి తన సినిమాని ఇలా కాపీ కొట్టేసినందుకు రాజమౌళి వారిపై చర్యలు తీసుకుంటాడో లేక లైట్ తీసుకుంటాడో చూడాలి.