నటుడు, దర్శకుడు అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ వివాదంలో ఆయన పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనని తప్పుపట్టారు.

థియేటర్ల బంద్ వివాదం టాలీవుడ్ లో ఇంకా రగులుతూనే ఉంది. జూన్ 1 నుంచి ఎగ్జిబిటర్లు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ నిర్వహించాలని నిర్ణయించడం ఎంత పెద్ద వివాదానికి దారితీసిందో చూశాం. స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు హెచ్చరిక లాంటి ప్రకటన చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా థియేటర్ల వివాదం గురించి మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు చిత్రంపై కుట్ర చేసేందుకు థియేటర్ల బంద్ వ్యవహారాన్ని కొందరు తెరపైకి తీసుకు వచ్చినట్లు ఆరోపించారు. 

థియేటర్ల బంద్ వివాదం  

దీంతో వెంటనే స్పందించిన ఫిలిం ఛాంబర్ థియేటర్ల బంద్ లేదని క్లారిటీ ఇచ్చింది. దీనిపై అల్లు అర్జున్, దిల్ రాజు కూడా వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయరని తెలిపారు. ఈ వివాదంపై తాజాగా నటుడు, దర్శకుడు అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విప్లవాత్మక చిత్రాలతో నారాయణమూర్తి టాలీవుడ్ లో పీపుల్ స్టార్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

 పర్సెంటేజి విధానం లేకపోతే సింగిల్ థియేటర్లు ఉండవు 

ముందుగా ఆర్ నారాయణ మూర్తి.. తెలంగాణలో గద్దర్ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా త్వరలో ఏపీలో కూడా ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించాలని కోరారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. నేను థియేటర్ల బంద్ వివాదం గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. పర్సంటేజీ విధానం కోసమే థియేటర్ల బంద్ ప్రకటించారు. పర్సంటేజీ విధానం లేకపోతే నిర్మాతలు, సింగిల్ థియేటర్లు మనుగడ సాగించే పరిస్థితి లేదు.

 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు

ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా శాంతియుతంగా బంద్ నిర్వహించుకునే హక్కు ఉంది. కానీ ఇది హరిహర వీరమల్లు చిత్రంపై కుట్ర అంటూ చిత్రీకరించడం చాలా బాధ కలిగించింది. నాలాంటి నిర్మాతలు అంతా పర్సంటేజీ విధానం కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ ఇది తీవ్ర విఘాతం కలిగించే అంశం. థియేటర్ల బంద్ అంశంలో కుట్ర ఉంది అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ప్రకటన రావడం కరెక్ట్ కాదు. స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా అదే విధంగా మాట్లాడడం సరైనది కాదు.

ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్లి విజయం సాధించారు. చిత్ర పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి వెళ్లి డిప్యూటీ సీఎం కావడం మా అందరికీ గర్వకారణం. అసలు పవన్ కళ్యాణ్ సినిమా మీద ఎవరు కుట్ర పన్నుతారు? అని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ప్రకటన చేయకుండా, హరిహర వీరమల్లు చిత్రం గురించి ప్రస్తావించకుండా.. నిర్మాతల్ని, ఎగ్జిబిటర్లని చర్చలకు పిలిచి సమస్యని పరిష్కరించి ఉంటే బాగుండేది.

 టికెట్ ధరలపై కామెంట్స్ 

పర్సంటేజీ విధానం లేకపోతే సింగిల్ థియేటర్ లు ఉండవు. సింగిల్ థియేటర్లు లేకపోతే సామాన్య ప్రేక్షకులు సినిమా ఎక్కడ చూడాలి? విపరీతమైన టికెట్ ధరలు, పాప్కార్న్ ధరల కారణంగా సామాన్య ప్రేక్షకుడు మల్టీప్లెక్స్ లకు వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేదు అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. నారాయణ మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో సరికొత్త చర్చికి దారితీసాయి.