అల్లు అర్జున్ అభిమానులకు నిరాశకి ఇక ఫుల్ స్టాప్ పడబోతుంది. వారికి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేశారట దర్శకుడు సుకుమార్. బన్నీ బర్త్ డే సందర్భంగా డబుల్ ట్రీట్ రాబోతుందని సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `పుష్ప2`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాస్త స్లోగా సాగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగం వచ్చి ఏడాది దాటింది. సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. షూటింగ్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. దీంతో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
దీంతో ఎట్టకేలకు అప్డేట్ ఇవ్వాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట. బన్నీ బర్త్ డే(ఏప్రిల్ 8) సందర్భంగా ఏకంగా రెండు సర్ప్రైజ్లు ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ 7న `పుష్ప 2` నుంచి కాన్సెప్ట్ టీజర్ విడుదల చేయబోతున్నారట. ఆ తర్వాత నెక్ట్స్ డే పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫస్ట్ లుక్ని విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై టీమ్ రియాక్ట్ అయ్యింది. రేపు(ఏప్రిల్ 5న) 11.07 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించింది. ఈ రెండు అప్డేట్లని రేపు ఖరారు చేసే అవకాశం ఉంది.
అంతేకాదు మరో గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఈ సినిమా రిలీజ్ డేట్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని గతంలో ప్రచారంజరిగింది. కానీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరుని చూస్తుంటే సంక్రాంతికి సాధ్యం కాదని, వచ్చే ఏడాది సమ్మర్ కి ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది చివర్లో వచ్చినా ఆశ్చర్యం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుందని సమాచారం.
ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `పుష్పః ది రూల్` సినిమాలో బన్నీతోపాటు ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ వంటి వారు నటిస్తున్నారు. సాయిపల్లవి నటిస్తుందనే సమాచారం కూడా ఉంది. కానీ ఇటీవల ఆమె మాట్లాడుతూ అది నిజం కాదని తెలిపింది. మరి ఏది నిజమనేది మున్ముందు తేలనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
మొదటి భాగం `పుష్ప` సంచలన విజయం సాధించింది. దీంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు మూడువందల కోట్లకుపైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా లావిష్గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదటి భాగంలో పుష్పరాజ్(బన్నీ) అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ లీడర్గా ఎదుగుతాడు. ఇక రెండో భాగంలో ఆయన రూలర్గా కనిపించబోతున్నారట. ఆయన రూలింగ్, డౌన్ ఫాలింగ్ ఇందులో ఉండబోతున్నాయని, దీంతోపాటు కొన్ని షాకింగ్ ట్విస్ట్ లు కూడా ఉండబోతున్నాయని సమాచారం.