డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్ సిట్ కు తెలిసిన సమాచారమంతా ఇచ్చానన్న పూరీ జగన్ డ్రగ్స్ కాక దేశంలోని వంద సమస్యలపై జనగణమణ రాశానన్న పూరీ
డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్ టాప్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాస్త రిలాక్స్ డ్ గా కనిపిస్తున్నారు. సిట్ విచారణలో సుదీర్థంగా పది గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న ఆయన.. తనకు డ్రగ్స్ అలవాటు అస్సలు లేదని స్పష్టం చేశారు. అసలు డ్రగ్స్ దందా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సిట్ విచారణలో చాలా ఖచ్చితంగా తనకు తెలిసిందంతా చెప్పానని తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పేర్కొన్నారు.
ఇక సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. తాను ఎన్నో కష్టాలు పడినా, ఎన్నో సార్లు మోసపోయినా చెడు అలవాట్లకు, తప్పుడు పనులకు లొంగలేదన్నారు. తాను చట్ట వ్యతిరేక పనులు చేసే మనిషిని కాదన్నారు. మనకు కష్టం వస్తే మన వెంట ఎవరూ నిలవరని, మనల్ని మనం నమ్ముకోవాలి తప్ప మరొకరిని నమ్ముకోవద్దని బలంగా నమ్ముతానని పూరీ అన్నారు. ఇక తాను బ్యాంకాక్ వెళ్లినప్పుడు కేవలం సినిమా స్క్రిప్ట్ రాసుకుంటానని పూరీ స్పష్టం చేశారు.
ఇక డ్రగ్స్ లాంటి సమస్యలే కాక.. భారత దేశంలో సహజంగా కనిపించే వంద రకాల సమస్యలతో తాను జనగణమన అనే సినిమా రాసుకున్నానన్నారు పూరీ. త్వరలోనే జనగణ మణ సినిమాలో సమస్యలపై గళమెత్తుతానన్నారు. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ ఇండియన్స్ అంటూ వుండే ట్యాగ్ లైన్ తో ఈ జనగణమణ సినిమా తెరకెక్కిస్తానన్నారు పూరీ.
డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు వచ్చినపప్పుడు తనకంటే ఎక్కువ తన తమ్ముడు, కుటుంబ సభ్యులు బాధ పడ్డారని పూరీ చెప్పారు. అయితే విచారణ అనంతరం ఫ్యామిలీ కాస్త రిలాక్స్ డ్ గా వున్నారని పూరీ చెప్పారు. తాను తప్పు చేసి వుంటే సిట్ ఏ చర్యలైనా తీసుకోవచ్చని పూరీ స్పష్టం చేశారు.
