క్యాన్సర్ కి బలైన ప్రముఖ నిర్మాత... ప్రముఖుల సంతాపం!
60 ఏళ్ల ప్రదీప్ గుహ చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ప్రదీప్ మరణించారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రదీప్ గుహ తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల ప్రదీప్ గుహ చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ప్రదీప్ మరణించారు. క్యాన్సర్ స్టేజ్ 4కి చేరడంతో శుక్రవారం వెంటిలేటర్పై చికిత్సఅందిస్తున్నారు. వైద్యులు ఎంతగా శ్రమించినా ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రదీప్ గుహ మరణాన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రదీప్ మరణవార్త తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
నటుడు మనోజ్ బాజ్పేయి, సుభాష్ ఘాయ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. హీరోయిన్లు దియామీర్జా, లారా దత్తా మిస్ ఆసియా పసిఫిక్ పోటీల నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక నోట్ రాశారు. ఒక గొప్ప శక్తిని కోల్పోయామంటూ విచారం వ్యక్తం చేశారు. గత 21 సంవత్సరాలుగా తనకు ధైర్యాన్నిచ్చిన వ్యక్తి అంటూ ఆయనకు నివాళులర్పించారు.
మీడియా మొఘల్ గా పేరుగాంచిన ప్రదీప్ గుహ 9ఎక్స్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, జీ నెట్వర్క్ వంటి ప్రముఖ సంస్థలలో పనిచేశారు. ఆయనకు భార్య పాపియా గుహా, కుమారుడు సంకేత్ ఉన్నారు. హృతిక్ రోషన్, కరిష్మా కపూర్ నటించిన 'ఫిజా' , మిథున్-డింపుల్ కపాడియా జంటగా 'ఫిర్ కభీ' చిత్రాలను గుహ నిర్మించారు.