తెలుగుదేశం పార్టీకి భారీ స్థాయిలో విరాళం ప్రకటించాడు ప్రముఖ నిర్మాత నాగవంశీ. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ప్రకటించారు.

 

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, యువ నిర్మాత నాగవంశీ తెలుగుదేశం పార్టీకి రూ.25 లక్షల విరాళాన్ని అందించారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.

ప్రతి ఏడాది టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానాడును నిర్వహించడం టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం మహానాడు మే చివరి వారం కడపలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా, పార్టీకి భారీగా విరాళాలు అందించిన దాతల పేర్లను వేదికపై చంద్రబాబు నాయుడు చదివి వినిపించారు. అందులో భాగంగానే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ 25 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు వెల్లడించారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రియాశీలంగా ఉన్న నాగవంశీ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే అనేక చిత్రాల్లో త్రివిక్రమ్ కీలకంగా భాగస్వామ్యం వహిస్తున్నారు. ఆయన భార్య సౌజన్యను కొన్నిసార్లు నిర్మాతగా చేర్చడం, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే సంస్థ కాంబినేషన్ లో కొన్ని సినిమాలు కూడా తెరకెక్కించారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్న నాగవంశీ ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి విరాళం ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తోంది. పార్టీకి మద్దతుగా సినీ ప్రముఖులు కూడా ముందుకు రావడం టీడీపీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపింది.