#Karthi: కార్తీ సినిమా వివాదం..సారీ చెప్పిన నిర్మాత
అతడి పనిని, చిత్తశుద్ధిని అవమానించినందుకు నువ్వు అతడికి క్షమాపణలు చెప్పాల్సిందే.
![producer Gnanavel Raja Say Sorry To Ameer On Karthi Paruthiveeran Movie Controversy jsp producer Gnanavel Raja Say Sorry To Ameer On Karthi Paruthiveeran Movie Controversy jsp](https://static-ai.asianetnews.com/images/01hgd1953ybwda15bz99c61gte/gna-cleanup--1--jpg_363x203xt.jpg)
కార్తీ నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్ సినిమా బడ్జెట్ గురించి తలెత్తిన ఈ వివాదం మొత్తానికి ముగింపుకు వచ్చింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పి ముగించారు. కొన్నిరోజుల క్రితం పరుత్తివీరన్ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత జ్ఞానవేల్ రాజా... డైరెక్టర్ అమీర్ పై సంచలన ఆరోపణలు చేయటంతో వివాదం ప్రారంభమైంది. పరుత్తివీరన్ సినిమా విషయంలో డైరెక్టర్ అమీర్ ఎక్కువగా ఖర్చు చేశాడని.. తన అవసరాలకు వాడుకున్నాడని.. దాంతో బడ్జెట్ పెరిగిపోయిందంటూ నిర్మాత జ్ఞానవేల్ ఆరోపించాడు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకుడు అమీర్ కు మద్దతు తెలుపుతూ వచ్చారు. ఈ వరసలో ఇప్పటికే సినీ నిర్మాత శశికుమార్, నటుడు సముద్రఖని, సుధా కొంగర, నటుడు పొన్వన్నన్ తదితరులు అమీర్కు మద్దతుగా నిలిచారు. రీసెంట్ గా దర్శకుడు భారతీ రాజా సైతం అమీర్కు సపోర్ట్ చేస్తూ ఓ నోట్ షేర్ చేశారు.
అమీర్ కోసం మాట్లాడాడు. జ్ఞానవేల్ను మందలించాడు. క్షమాపణలు చెప్పాల్సిందే అని ఒత్తిడి తెచ్చాడు. “జ్ఞానవేల్.. నేను మీరు మాట్లాడిన వీడియో చూశాను. పరుత్తివీరన్ సినిమాపై మీరు ఆర్థిక సమస్యలు ఉన్నాయి.. కానీ నువ్వు ఒక గొప్ప క్రియేటర్ను, అతడి పేరును, ప్రతిష్టను, కృషిని దిగజార్చేలా మాట్లాడటం ఖండించాల్సిన విషయం. ఈ సినిమా విషయంలో అమరీ పాత్ర చాలా పెద్దదని మర్చిపోవద్దు. పరుత్తివీరన్ కంటే ముందు డైరెక్టర్ అమీర్ రెండు సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ మీ సినిమాతోనే పని నేర్చుకున్నాడు.. సంపాదించాడు అని చెప్పడం నాలంటి క్రియేటర్లను అవమానించడమే. ఎందుకంటే నిజమైన క్రియేటర్స్ చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక గొప్ప క్రియేటర్, అతడి పనిని, చిత్తశుద్ధిని అవమానించినందుకు నువ్వు అతడికి క్షమాపణలు చెప్పాల్సిందే. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడం మంచిదని భావిస్తున్నాను” అంటూ ప్రకటన విడుదల చేశారు భారతీ రాజా. దాంతో ఈ వివాదానికి ముగింపు చెప్పటానికి నిర్మాత జ్ఞానవేల్ రాజా క్షమాపణ చెప్పారు.
”పరుతివీరన్ సమస్య గత 17 ఏళ్లుగా కొనసాగుతోంది. నేను ఈరోజు వరకు దాని గురించి మాట్లాడలేదు. నేనెప్పుడూ ఆయన్ను ‘అమీర్ అన్నా’ అని పిలుస్తాను. మొదటి నుంచి మా కుటుంబానికి సన్నిహితుడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన నా గురించి చేసిన తప్పుడు ఆరోపణలు నన్ను చాలా బాధించాయి. ఆయన మాటలకు బదులిచ్చే క్రమంలో నేను వాడిన కొన్ని పదాలు తన మనోభావాలను గాయపరిచినట్లయితే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నాతో పాటు ఎంతోమందిని ఆదుకునే చిత్ర పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు.