ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసుకి పెను ప్రమాదం తప్పింది. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అనేక చిత్రాలు నిర్మించారు. 

ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసుకి పెను ప్రమాదం తప్పింది. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అనేక చిత్రాలు నిర్మించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇద్దరికీ బన్నీ చాలా క్లోజ్ గా ఉంటారు. అలాగే బన్నీ వాసు తరచుగా జనసేన కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. 

అయితే బన్నీ వాసు తాజాగా గోదావరి వరదలో పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచి మండలం ప్రాంతంలో బన్నీ వాసు ఓ గర్భిణీ స్త్రీని రక్షిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఏపీలో భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. 

గోదావరి చుట్టూ ఉన్న పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో బన్నీ వాసు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరదలో చిక్కుకున్న బాడవ గ్రామం నుంచి ఓ గర్భిణీ స్త్రీని ఏనుగు లంకకు బన్నీ వాసు, జనసేన నాయకులు పడవలో తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. 

దీనితో వారు ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పి ఓ కొబ్బరి చెట్టుకుని ఢీకొంది. దీనితో ఒక్కసారిగా పడవలోని వారు కంగారు పడ్డారు. పడవ నడిపే వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించి అందరిని ఒడ్డుకు చేర్చారు. అదృష్టం బావుండడంతో అంతా సురక్షితంగా బయట పడ్డాం అని బన్నీ వాసు అన్నారు. వరద కారణంగా చాలా లంక గ్రామాల ప్రజలు ప్రమాదంలో ఉన్నారని వారందరిని ప్రభుత్వం వెంటనే రక్షించాలి అని బన్నీ వాసు ఈ సందర్భంగా కోరారు.