ప్రియాంక చోప్రా డాక్టర్ అయింది..సినిమాలో కాదు నిజంగా..
- డాక్టర్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా
- బరేలీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
- గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రియాంక
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. బరేలీ అంతర్జాతీయ వర్శిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. ఆమె స్వస్థలం యూపీలోని బరేలీలో ఈ గౌరవం అందుకోనుండటం విశేషం. ఆదివారం ఆమెకు వర్శిటీ ఛాన్సలర్ కేశవ్ కుమార్ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్షవర్థన్, యూపీ ఆర్థికమంత్రి రాజేశ్ అగర్వాల్ హాజరుకానున్నారు.
దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రియాంక స్వస్థలానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు జ్ఞాపికను అందజేయనున్నారు. తన కుమార్తెకు డాక్టరేట్ ప్రకటించడం పట్ల ప్రియాంక తల్లి మధు చోప్రా హర్షం వ్యక్తంచేశారు. కాగా, విద్య, వైద్యం, బాలికలకు విద్య అందించే లక్ష్యంతో ప్రియాంక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. 2000లో ప్రపంచ సుందరిగా ఎంపికైన తర్వాత ఆమె ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె యునిసెఫ్ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగానూ ఉన్నారు. గతేడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.అటు సినిమా రంగానికి, ఇటు సామాజిక అంశాలపై పోరాడుతున్నారు.