ప్రిన్స్ యావర్ కోపం వెనుక కన్నీటి బాధ.. శివాజీ ముందు గోడు వెళ్లబోసిన కండల వీరుడు
శివాజీ వద్ద తన బాధని వెల్లడించాడు యావర్. తాన ఫ్యామిలీ విషయాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోపం వెనుకున్న బాధని వెల్లడించారు యావర్.

బిగ్ బాస్ తెలుగు 7 మూడో వారం ముగింపుకి చేరుకుంది. హౌజ్లో స్థానం సంపాదించే కంటెస్టెంట్ ఎవరనేది తేలబోతుంది. పవర్ అస్త్ర ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. అయితే గురువారం ఎపిసోడ్లో మూడోవారం పవర్ అస్త్ర సాధించేందుకు కంటెండర్లుగా యావర్, శోభా శెట్టి, ప్రియాంక ఫైనల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే ఫైనల్గా పవర్ అస్త్ర కోసం పోటీ పడాల్సి వస్తుంది. అందులో ఎవరికి అర్హత లేదో తెలియజేయాలని బిగ్ బాస్ ఆదేశించారు.
దీంతో శోభా శెట్టి యావర్ పేరు చెప్పింది. మరోవైపు ప్రియాంక కూడా యావర్ పేరే చెప్పింది. తమ కంటే బలమైన వ్యక్తి అని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు శోభా శెట్టి తెలిపింది. మరోవైపు యావర్ ప్రవర్తన నచ్చక తాను నిర్ణయం తీసుకున్నట్టు ప్రియాంక చెప్పింది. అయితే వారి నిర్ణయంతో యావర్ హర్ట్ అయ్యాడు. ఆవేశానికి గురయ్యారు. ఇద్దరితో గట్టిగా వాదించారు. సత్తా ఉంటే పోరాడాలని, ఇలా తప్పించడం సరికాదని, ఆయన వాదించాడు. ఆయన వాదన కంట్రోల్ తప్పింది. కోపం భరించలేక తన టేబుల్ని పగుల గొట్టాడు యావర్.
ఆ తర్వాత కోపం తగ్గించుకుని బిగ్ బాస్కి సారీ చెప్పారు. అదే విధంగా శోభా శెట్టి వచ్చి కూడా యావర్కి క్షమాపణలు చెప్పింది. దీంతో ఇద్దరు హగ్ చేసుకుని రిలీఫ్ అయ్యారు. అనంతరం శివాజీ వద్ద తన బాధని వెల్లడించాడు యావర్. తాన ఫ్యామిలీ విషయాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్కి రావడానికి ముందు తన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ అని, చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిపారు. తనకు జాబ్ కూడా లేదన్నారు. ఇంటికి డ్రెస్సులు పంపమని కూడా తాను అడగడం లేదని, వారి పరిస్థితి తెలిసి తాను ఆగడం లేదన్నారు. అందుకే తాను అలా ఎమోషన్ అయినట్టు చెప్పారు ప్రిన్స్ యావర్. దీంతో శివాజీ ఓదార్చే ప్రయత్నం చేశాడు. దేవుడు అన్ని చూసుకుంటాడని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు.
మరోవైపు ప్రశాంత్, శుభ శ్రీల మధ్య కాస్త సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. శుభ శ్రీ, గౌతం కృష్ణని మధ్య కెమిస్ట్రీ గురించి ప్రశాంత్ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. దీనికి ఆమె రతిక గురించి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. కాసేపు ఇది అలరించింది. మరోవైపు గౌతంకృష్ణ భర్తగా, శుభ శ్రీ భార్యగా, శివాజీ మామయ్యగా సరదాగా స్కిట్ని ప్రదర్శించారు. ఇది కాసేపు నవ్వులు పూయించింది.
ఇక పవర్ అస్త్ర కోసం శోభా శెట్టి, ప్రియాంకలకు బుల్ టాస్క్ ఇచ్చాడు. దానిపై కింద పడకుండా ఎక్కువ సేపు ఎవరు హోల్డ్ చేస్తారో వారు విజేత. ఇద్దరు మూడు నాలుగు రౌండ్లు ఆడారు. ఇద్దరి విజేత ఎవరనేది రేపు నాగార్జున ప్రకటిస్తారని బిగ్ బాస్ తెలిపారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు పవర్ అస్త్ర సాధిస్తారనేది చూడాలి. ఇక రేపు వీకెండ్ కావడంతో నాగార్జున వస్తారు. నామినేషన్లో ఉన్న వారి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోతుందనే విషయం తెలిసిందే.