దిలీప్ కుమార్ సినిమా యూనివర్సిటీః రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మోడీ, రాహుల్ గాంధీ సంతాపం
దిలీప్ కుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. 60ఏళ్లు సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని వారు గుర్తు చేస్తూ నివాళ్లర్పిస్తున్నారు.రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సంతాపం తెలిపారు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం దిగ్ర్భాంతికి గురయ్యారు. భారతీయ సినిమాకి ఆయనొక ఆద్యుడని, సినిమాకి, నటనకి ఆయన ఓ యూనివర్సిటీ లాంటి వారని సినీ, రాజకీయ ప్రముఖులు కొనియాడారు. దిలీప్ కుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. 60ఏళ్లు సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని వారు గుర్తు చేస్తూ నివాళ్లర్పిస్తున్నారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సంతాపం తెలిపారు. `మాజీ రాజ్యసభ సభ్యుడు, నటుడు దిలీప్ కుమార్ మరణం తీవ్ర ఆవేదనకి గురి చేసింది. ప్రపంచ సినిమా గొప్ప భారతీయ నటుడిని కోల్పోయింది. ట్రాజెడీ కింగ్గా పేరు తెచ్చుకున్న ఆయన పురణాలు, సాంఘీకాలు, రొమాంటిక్ ఇలా అన్ని రకాల జోనర్ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ఆడియెన్స్ లో ఉత్సాహాన్ని నింపారు.
హిందీ సినిమాలోని గొప్ప నటులలో కొందరు నటన వైవిధ్యమైన నైపుణ్యాలను అర్థం చేసుకోవడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ఎనలేని సేవ అందించారు. ఆయన మరణాన్ని మరెవరూ పూడ్చలేరు. ఈసందర్భంగా వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా` అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
సినిమా లెజెండ్గా దిలీప్ ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. `అసమాన తేజస్సు ఆయన సొంతం. అందుకే ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటు` అని మోదీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సేవలు రానున్న తరాలకు కూడా గుర్తుండి పోతాయన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
బాలీవుడ్లో ఒక అధ్యాయం ముగిసిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిలీప్ కుమార్ మృతిపై సంతాపం తెలిపారు. యూసుఫ్ సాబ్ అద్భుతమైన నటనా కౌశలం ప్రపంచంలో ఒక విశ్వవిద్యాలయంలా నిలిచిపోతుందన్నారు. ఆయన మనందరి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ సీఎం ట్వీట్ చేశారు.
పాకిస్థాన్లోని పెషావర్లో 1922 డిసెంబర్ 11న జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. సినిమా రంగంలోకి వస్తోన్న సమయంలో తన పేరును మార్చుకున్నారు. 1944 తన తొలి సినిమా `జ్వర్ భాటా`లో నిర్మాత దేవికా రాణి సూచన మేరకు యూసుఫ్ ఖాన్ తన పేరును దిలీప్ కుమార్గా మార్చు కున్నారు. రొమాంటిక్ హీరోగా ప్రఖ్యాతి గాంచిన ఆయన `మధుమతి`, `దేవదాస్`, `మొఘల్ ఏ ఆజమ్`, `గంగా జమునా`, `రామ్ ఔర్ శ్యామ్`, `కర్మ` లాంటి అద్భుతమైన కళాఖండాల్లాంటి చిత్రాల్లో నటించారు.