#Prabhu Deva:'మై డియర్ భూతం' ఓటీటీ రిలీజ్ డేట్…
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసారు.
స్టార్ డాన్స్ డైరక్టర్, హీరో, దర్శకుడు ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ భూతం’. ఇందులో ఆయన జీనీగా నటించారు. ఆ గెటప్ పెద్దలతో పాటు పిల్లల్ని ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ ఆయన నటించిన చిత్రాలకు భిన్నమైన చిత్రమిది. ఫాంటసీ కథతో రూపొందిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో అదే రోజు విడుదల అయ్యింది. ఇప్పుడు ఆ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటిటి రైట్స్ ని జీ 5 వారు తీసుకున్నారు. సెప్టెంబర్ 2 నుంచి జీ5 ఓటిటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
— ZEE5 Tamil (@ZEE5Tamil) August 28, 2022
చిత్రం కథ ఏమిటంటే….కర్ణముఖి (ప్రభుదేవా) భూత లోకానికి మహారాజు. అయితే, ఓ ముని శాపం కారణంగా భూలోకంలో రాయిలా మారిపోతాడు. ఆ శాపం నుంచి బయటకు రావాలంటే.. ఆ రాయిని ఎవరో ఒకరు స్పర్శించాలి. అలాగే ఆ వ్యక్తినే, ఆ కర్ణముఖి ప్రతిమలోని మంత్రాన్ని చదవాలి. అప్పుడే కర్ణముఖి తన లోకానికి వెళ్లగలడు. ఇక, మరోపక్క శ్రీరంగం శ్రీనివాసరావు (అశ్వంత్) అనే పిల్లాడు నత్తితో బాధపడుతుంటాడు. స్కూల్ లో కూడా శ్రీనివాసరావును చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. కొందరు అవమానిస్తుంటారు. . చివరకు అతని తల్లి (రమ్య నంబీశన్) కూడా శ్రీనివాసరావు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోదు.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరంగం శ్రీనివాసరావు అనుకోకుండా కర్ణముఖి ప్రతిమను తాకుతాడు. కర్ణముఖి బయటకు వస్తాడు. కానీ.. తన లోకానికి వెళ్ళాలి అంటే.. శ్రీనివాసరావు మంత్రం చదవాలి. మరి, నత్తితో బాధపడే శ్రీనివాసరావు ఆ మంత్రం సరిగ్గా చదివాడా ? లేదా ?, కర్ణముఖి తన లోకానికి తిరిగి వెళ్తాడా ? లేదా ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మెయిన్ కథ.
పిల్లలతో సినిమా తీసినా, పిల్లలను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసినా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎదుర్కొనే సమస్యల మీద వినోదాత్మకంగా కథను రాసుకుంటే ఇక తిరుగులేదని చెప్పొచ్చు. ఇప్పుడు దర్శకుడు ఎన్ రాఘవన్ కూడా అదే ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. మై డియర్ భూతం కథ పిల్లలకు ఎక్కువగా నచ్చుతుంది. పిల్లలు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి.. వాటిని మనం సున్నితంగా ఎలా పరిష్కరించాలో చూపించారు దర్శకుడు.
ఇక ప్రభుదేవా తరువాత ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచేది మాత్రం శ్రీనివాస్గా నటించిన అశ్వంత్. నత్తితో బాధపడే పిల్లాడిగా అశ్వంత్ నటన అద్భుతంగా సాగింది. ఇక శ్రీనివాస్ తల్లి పాత్రలో రమ్యా నంబీశన్ చక్కగా నటించింది. ఇక మిగతా పిల్లలు కూడా అదరగొట్టేశారు. రమ్యా నంబీసన్, తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ:యూకే సెంథిల్ కుమార్.