'సాహో' వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రూ.400 కోట్లు!
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ బాక్సాఫీసు బూజును దులుపుతోంది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ ప్రభావం వసూళ్లపై పడలేదు.
ఆగస్ట్ 30న విడుదలైన 'సాహో' సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్స్ పై మాత్రం పెద్దగా ఎఫెక్ట్ పడడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 'సాహో' రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది.
ఈ మేరకు ఒక పోస్టర్ను విడుదల చేసింది. 'ఇంతకంటే ఎక్కువ మీరు ఊహించగలరా..' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే అభిమానులు మాత్రం ఇది సరిపోదని అంటున్నారు. రూ.350 కోట్లు పెట్టి తీసిన సినిమా కనీసం రూ.500 కోట్ల గ్రాస్ అయినా రాబట్టాలని అంటున్నారు.
మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసిందో అంతే మొత్తాన్ని బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా రాబట్టడం విశేషం. మొదటి వారం రోజుల్లో ఈ సినిమా రూ.370 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే ఇందులో బాలీవుడ్ నుంచే రూ.116 కోట్లు వచ్చాయి.
10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే దానిలో రూ.130 కోట్లు బాలీవుడ్ నుండి రావడం విశేషం. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు సుజీత్ రూపొందించారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లకు సంబంధించిన స్టార్లు ఈ సినిమాలో నటించారు.