కనీసం ఐదారు కి.మీ. కూడా నడవలేని పవన్‌.. రాష్ట్ర వ్యాప్తంగా వేల కి.మీ. నడిచిన జగన్‌తో పోల్చుకుంటారా అంటూ  పోసాని కృష్ణమురళి సెటైర్లు వేశారు. ప్రభుత్వ పాఠశాలలు ఎలా మార్పు చెందాయో ఎప్పుడైనా చూశారా? విద్యార్థులకు అన్నీ ఉచితంగా ఇవ్వటంతో పాటు, స్కూల్‌కు వెళ్లిన వాళ్లకు జగన్‌ ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తోందని పోసాని గుర్తుచేశారు.

తెలుగు చిత్ర సీమలోని కష్టాలపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ , సినీ రంగాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికే పవన్‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చిన రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి.. మంగళవారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్.. కేసీఆర్‌ను విమర్శించరని మండిపడ్డారు. రాజకీయాల్లో ఆరోపణలు చేయడంలో తప్పులేదని... ఆరోపణలు ఎవరైనా చేయొచ్చని ఆయన వెల్లడించారు. జగన్ గురించి పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. పవన్ కల్యాణ్‌ను బహిరంగంగా హెచ్చరించారని అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏం చేశారని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. జగన్ ఏమీ అనట్లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న ప్రెస్‌మీట్ పెట్టాక పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని ఆరోపించారు. నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వచ్చాయని ఆయన తెలిపారు. తాను పవన్‌ని ప్రశ్నించానని.. గతంలో చిరంజీవిని కేశినేని నాని విమర్శిస్తే తాను ఖండించానని పోసాని గుర్తుచేశారు. ఆ రోజు చిరంజీవిని కేశినేని విమర్శిస్తే పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని ఆయన మండిపడ్డారు. ఆ రోజు మాట్లాడితే తనకు చిరంజీవి డబ్బులు ఇచ్చారా అని పోసాని ధ్వజమెత్తారు.

ALso Read:ఆ టైమ్‌లో చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారుః పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కల్యాణ్‌ ప్రజల మనిషి కాదని.. ఇండస్ట్రీ మనిషి అంతకన్నా కాదంటూ కృష్ణమురళి మండిపడ్డారు. కనీసం ఐదారు కి.మీ. కూడా నడవలేని పవన్‌.. రాష్ట్ర వ్యాప్తంగా వేల కి.మీ. నడిచిన జగన్‌తో పోల్చుకుంటారా అంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వ పాఠశాలలు ఎలా మార్పు చెందాయో ఎప్పుడైనా చూశారా? విద్యార్థులకు అన్నీ ఉచితంగా ఇవ్వటంతో పాటు, స్కూల్‌కు వెళ్లిన వాళ్లకు జగన్‌ ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తోందని పోసాని గుర్తుచేశారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసి, జగన్‌కు వదలి వెళ్లారని ఆయన మండిపడ్డారు. వాటిని తీరుస్తూ, వడ్డీలు కడుతూ, కొత్త అప్పులు తెస్తూ, ప్రజల సంక్షేమాన్ని చూసుకోవటం మామూలు విషయం కాదని పోసాని ప్రశంసించారు. చంద్రబాబులా జగన్‌ ఏమీ విదేశీ పర్యటనలు చేయలేదన్నారు. పవన్‌ ప్రతి పార్టీని విమర్శించే పని పెట్టుకున్నారని... కొన్నాళ్లు టీడీపీని, ఇంకొన్నాళ్లు బీజేపీని, ఇప్పుడు వైసీపీని విమర్శిస్తున్నారని పోసాని ఎద్దేవా చేశారు.