టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు దర్శకుడు శరత్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు శరత్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన ఫ్యామిలీ విషాదంలోకి వెళ్లింది. దర్శకుడు శరత్‌ తెలుగులో పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇరవైకిపైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 

`డియర్‌` అనే నవల ఆధారంగా `చాదస్తపు మొగుడు` అనేసినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా శరత్‌ పరిచయం అయ్యారు. ఏఎన్నార్‌, బాలకృష్ణ, సుమన్‌ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి విజయాలను అందుకున్నారు. ఏఎన్నార్‌తో `కాలేజీ బుల్లోడు`, జగపతిబాబుతో `భలే బుల్లోడు`, బాలకృష్ణతో `వంశానికొక్కడు`, `పెద్దన్నయ్య`, `సుల్తాన్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను రూపొందించారు. అలాగే సుమన్‌తో `చాదస్తపు మొగుడు`, `పెద్దింటి అల్లుడు`, `బావ బావమరిది`, `చిన్నల్లుడు` వంటి సినిమాలను రూపొందించారు. ఇదిలా ఉంటే శరత్‌ మ్యారేజ్‌ చేసుకోలేదు. 

దర్శకుడు శరత్‌ మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మృతి టాలీవుడ్‌కి తీరని లోటని వెల్లడిస్తున్నారు. 

.