`పొన్నియిన్ సెల్వన్ 2` ట్రైలర్.. అంచనాలను రీచ్ అయ్యిందా?.. కరికాలుడిని నందిని చంపుతుందా?
`పొన్నియిన్ సెల్వన్ 2` ట్రైలర్ ఈవెంట్ బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో పీఎస్ 2 ట్రైలర్ ని విడుదల చేశారు. మరి భారీ అంచనాలతో వచ్చిన ట్రైలర్ ఆడియెన్స్ అంచనాలను రీచ్ అయ్యిందా? అసలు ఎలా ఉంది?
మణిరత్నం నుంచి వస్తోన్న మరో దృశ్య కావ్యం `పొన్నియిన్ సెల్వన్ 2`. గతేడాది వచ్చిన `పొన్నియిన్ సెల్వన్ 1`(పీఎస్1)కి కొనసాగింపు. విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూలిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ప్రతిభన్, రెహ్మాన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
చెన్నైలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గ్రాండ్ ట్రైలర్, మ్యూజికల్ ఈవెంట్లో భాగంగా `పీఎస్2` ట్రైలర్ని విడుదల చేశారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ట్రైలర్స్ ని ఏక కాలంలో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, విజువల్ వండర్లా సాగింది. కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులకు పైఎత్తులు, ట్విస్టులు, టర్న్ లు, పోరాటాలు, వెన్నుపోట్ల సమాహారంగా ట్రైలర్ సాగింది. ఛోళ రాజ్యం స్వాధీనం ఛోళ రాజులు తిరిగి దండయాత్ర చేపట్టడం ప్రధానంగా రెండో భాగం సాగుతుందని ట్రైలర్లో అర్థమవుతుంది.
అరుణ్మోలి(పొన్నియిన్ సెల్వన్)(జయంరవి) లంకలో చనిపోయాడనే వార్తతో ఛోళ సామ్రాజ్యాన్ని తమ స్వాధీనం చేసుకోవాలని నందిని(ఐశ్వర్యారాయ్) తమ అనుచరుణలతో కలిసి కుట్ర చేస్తుంటుంది. తన సోదరుడు చనిపోయాడనే వార్తతో కరికాలుడు(విక్రమ్) తన సైన్యంతో ఛోళ రాజ్యంపై దండయాత్రగా వెళతాడు. పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడని తెలిసి పెరియా బ్రదర్స్(శరత్ కుమార్, ప్రభు), మధురాంతకుడు(రెహ్మాన్), నందిని కలిసి కుట్ర చేసి తాను రాజుగా పట్టాభిషేకం చేయడం, మరోవైపు ఛోళ రాజ్యాన్ని రెండుగా విభజించాలనే మరో కుట్ర చేయడం వంటి అంశాల సమాహారంగా ట్రైలర్ సాగింది.
ఇందులో నందినిని పోలిన మరో వృద్ధ మహిళ(ఐశ్వర్య రాయ్) కనిపించడంతో ఆమె ఎవరు, ఆమె కథేంటి? అనేది, పొన్నియిన్ సెల్వన్ ని కాపాడేందుకు వల్లవ రాయన్(కార్తి) చేసే సపోర్ట్ ప్రధానంగా `పొన్నియిన్ సెల్వన్2` సినిమా సాగుతుందని అర్థమవుతుంది. నందిని కుట్రలను తండ్రి సుందర ఛోళన్(ప్రకాష్రాజ్)తో కలిసి కుందవై(త్రిష) ఏం చేసిందనేది ఆసక్తికరం. చివర్లో తన మాజీ ప్రియుడు కరికాలుడిని నందినినే చంపేందుకు సిద్దమవడం ఆద్యంతం ఆసక్తికరం. మొదటి భాగం మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా ఆ కథ అర్థం కాకపోవడం, అంతటి క్లారిటీ దర్శకుడు మెయింటేన్ చేయకపోవడం, గొప్పగా కథనం సాగకపోవడంతో యావరేజ్గా నిలిచింది. తమిళంలో బాగా ఆడింది. మరి రెండో భాగం దాన్ని మించి ఆడుతుందా? రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.
ఇక ఏఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభించింది. నేడు ఈవెంట్లో అన్ని పాటలను విడుదల చేశారు. ఇక కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన `పీఎస్ 2` ఈవెంట్లో చిత్ర బృందంతోపాటు ఇతర దిగ్గజ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగడం విశేషం. ఇక `పీఎస్2` సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు లాంగ్వేజ్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.