`ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. చిత్ర బృందం దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, పల్లవి జోషి శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. 

అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `ది కాశ్మీర్‌ ఫైల్స్`(The Kashmir Files). వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో అభిషేక్‌ అగర్వాల్‌, వివేక్‌ అగ్నిహోత్రి, పల్లవి జోషి, జీ స్టూడియో నిర్మించారు. ఈసినిమా శుక్రవారం(మార్చి 11)న విడుదలైంది. తాజాగా ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండని ఆధారంగా చేసుకుని దర్శకుడు వివేక్‌అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని రూపొందించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపమే ఈ సినిమా. 1990లో హిందు పండిత్స్ పై అప్పటి వరకు అక్కడే వారితో కలిసి మెలిసి తిరిగిన కొంత మంది వేరే మతానికి చెందిని వారు అక్కడ స్థానిక హిందూవుపై దారుణ మారుణ కాండకు పాల్పడ్డరు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్ధులుగా అయ్యేలా చేశారు. ఈ యదార్థ సంఘటనలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచిస్పందనతో దూసుకుపోతుంది. తొలి రోజు దేశ వ్యాప్తంగా దాదాపు మూడున్నర కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. 

తాజాగా ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అభినందించారు. చిత్ర బృందం దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, పల్లవి జోషి శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. ఈ సినిమా గురించి మోడీకి వివరించగా, ఆయన సినిమాని, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా యూనిట్‌ తమ సంతోషాన్ని పంచుకుంది. ప్రధాని మోడీ ప్రశంసలు, ఆయన ఆశీస్సులు అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొంది. అంతేకాదు మోడీతో దిగిన ఫోటోలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధానిని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ శాలువాతో సత్కరించడం విశేషం. ఈ సినిమాకి తెలుగులోనూ మంచి స్పందన లభిస్తుందని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే సినిమాని నిలిపివేయాలని కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు కాగా, కోర్ట్ ఆ పిటిషన్‌ కొట్టేస్తూ సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం సినిమాని విడుదల చేసింది యూనిట్‌. అవాంతరాలను దాటుకుని విడుదలైన `ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రానికి మంచి స్పందన రావడం పట్ల యూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తుంది.