పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.దీంతో ఆయన ఫ్యాన్స్ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ నారాయణమూర్తి అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది..  

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు నిమ్స్ లో చికిత్స జరుగుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయనకు స్వల్ప అనారోగ్యమే అని సమాచారం. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణమూర్తి చికిత్స పొందుతున్నాడు. ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. 'నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను. నేను కోలుకున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను..' అని ఆర్ నారాయణ మూర్తి మీడియాకు తెలియజేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆర్ నారాయణమూర్తి విలువలు కలిగిన నటుడు, నిర్మాత, దర్శకుడు. శ్రామిక, కర్షక వర్గం కోసం ఆయన సినిమాలు తీశారు. సమాజంలోని అవినీతి, పేదవారి కష్టాలు తన సినిమాలతో తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆర్ నారాయణమూర్తి హీరోగా తెరకెక్కిన ఎర్ర సైన్యం, ఒరేయ్ రిక్షా, ఎర్రోడు వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. 

ప్రస్తుతం స్టార్ హీరోల కమర్షియల్ చిత్రాల్లో ఆయనకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ డబ్బుల కోసం ఆయన తన సిద్ధాంతాన్ని వదులుకోవడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా నచ్చని పాత్ర చేయను అంటున్నారు. ఆర్ నారాయణమూర్తి అత్యంత నిరాడంబరమైన జీవితం గడుపుతున్నారు. ప్రసాద్ ల్యాబ్స్ వద్ద తరచుగా కనిపిస్తారు. బస్సులు, ఆటోల్లో సంచరిస్తారు. ఆయనకు హైదరాబాద్ లో ఇల్లు కూడా లేదు. 

ఆర్ నారాయణమూర్తి దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు శిష్యుడు కావడం విశేషం. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఆయన్నే కలిశాడట. డిగ్రీ పూర్తి చేసిరా. నటుడిగా సక్సెస్ కాకపోతే కనీసం ఉద్యోగం చేసుకోవచ్చని దాసరి చెప్పారట. డిగ్రీ కంప్లీట్ చేసి మరలా దాసరిని ఆర్ నారాయణమూర్తి కలిశారట. 1978లో ప్రాణం ఖరీదు మూవీలో ఓ పాత్ర చేశాడు. అనంతరం దాసరి నారాయణరావు సీతా రాములు చిత్రంలో ఓ అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రంలో కృష్ణంరాజు హీరో. 2021లో రైతన్న టైటిల్ తో మూవీ చేసిన ఆర్ నారాయణమూర్తి.. మరలా మరొక చిత్రం చేయలేదు.