యాక్షన్ ట్రాక్ ఎక్కిన పాయల్ రాజ్పుత్.. `రక్షణ` టీజర్ ఎలా ఉందంటే?
ఇటీవల వివాదంలో ఇరుక్కున్న పాయల్ రాజ్ `రక్షణ` సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. తాజాగా టీజర్ని రిలీజ్ చేశారు. మరి అది ఎలా ఉంది, వివాదం సెట్ అయ్యిందా?
![payal Rajput turn into action rakshana movie teaser out arj payal Rajput turn into action rakshana movie teaser out arj](https://static-ai.asianetnews.com/images/01hxm94nhya3hkddsfpm7rnt9f/9-jpg_363x203xt.jpg)
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ చూడబోతుంటే రూట్ మార్చినట్టుగా అనిపిస్తుంది. మొన్నటి వరకు గ్లామర్ బ్యూటీగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు యాక్షన్లోకి దిగింది. పోలీస్గా మారి నేరస్తుల అంతు చూసేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఆమె `రక్షణ` చిత్రంలో పోలీస్గా అదరగొడుతుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ మంగళవారం విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్గా సాగే టీజర్ ఆకట్టుకుంటుంది.
టీజర్లో ఓ హంతకుడు క్రూరంగా హత్యలు చేస్తుంటాడు. అతనెవరో కనిపెట్టి అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన పాయల్ రాజ్పుత్ ప్రయత్నిస్తుంటుందని అర్థమవుతుంది. `వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు.., ఇప్పటి వరకు నేను కచ్చితంగా వాడిని కలవలేదు.. ఏ రోజు నేను వాడ్ని కలుస్తానో అదే అఖరి రోజు` అని ఇందులో పాయల్ రాజ్పుత్ చెప్పే పవర్ఫుల్ డైలాగులు ఆకట్టుకున్నాయి.
మరి ఇందులో పాయల్ ఇచ్చే వార్నింగ్ ఎవరికి? ఎందుకోసం.. ఎవరినీ ఆమె వెతుకుతుంది? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేకర్స్. అయితే ఇన్నాళ్లు అందంతో ఆకట్టుకున్న పాయల్ పోలీస్ డ్రెస్లో పవర్ఫుల్గా కనిపిస్తుంది. తనలోని మరో యాంగిల్ని ఈ చిత్రంలో చూపించబోతుందని తెలుస్తుంది.
‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో `రక్షణ` సినిమాలో కనిపించబోతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ, `రక్షణ` టీజర్కు చాలా మంచి స్పందన వస్తుంది. ఇదొక ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల పాయల్.. నిర్మాతలపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తనకు పారితోషికం పూర్తిగా ఇవ్వలేదని, ప్రమోషన్స్ కి రావాలని బెదిరిస్తున్నారని, తెలుగు నుంచి బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆమె పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో దీనికి నిర్మాతలు స్పందిస్తూ, పాయల్ ప్రమోషన్స్ కి రాకుండా ఇలా తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించారు. ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇంతలోనే ఈ మూవీ టీజర్ రావడం గమనార్హం.