`ఖుషీ` వంటి ఎవర్ గ్రీన్ సినిమానందించిన నిర్మాత ఏ.ఎం రత్నంకి బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్
`మనం ఇప్పుడు బహుభాషా చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం. కానీ దశాబ్దానికి ముందే నాంది పలికిన నిర్మాత ఏ.ఎం రత్నం. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నిర్మించిన చిత్రాలు హిందీ ప్రేక్షకులకు చేరువయ్యేలా.. ఏ భాష ప్రేక్షకులనైనా మెప్పించేలా ఉండేవని తెలిపారు పవన్ కళ్యాణ్.
`ఖుషీ` పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ మైలురాయిలాంటి చిత్రం. ఎవర్ గ్రీన్ సినిమా. ఇప్పటికే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారంటే, అది ఏ రేంజ్లో విజయం సాధించిందో అర్తం చేసుకోవచ్చు. ఈ సినిమాకి ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించగా, నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మించారు. ఆ తర్వాత రత్నం నిర్మాణంలో `బంగారం` చిత్రంలో నటించారు పవన్. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న తన 27వ సినిమాకి కూడా ఏ.ఎం రత్నమే నిర్మాత. తన మేఘసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నేడు(గురువారం) ఏ.ఎం రత్నం బర్త్ డే. పుష్పగుచ్చం అందించి విషెస్ తెలిపారు పవన్. `అయ్యప్పనుమ్ కోషియుమ్` సెట్లో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, `మనం ఇప్పుడు బహుభాషా చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం. కానీ దశాబ్దానికి ముందే నాంది పలికిన నిర్మాత ఏ.ఎం రత్నం. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నిర్మించిన చిత్రాలు హిందీ ప్రేక్షకులకు చేరువయ్యేలా.. ఏ భాష ప్రేక్షకులనైనా మెప్పించేలా ఉండేవి. `భారతీయుడు` సినిమాను `ఇండియన్`గా బాలీవుడ్ లో విడుదల చేస్తే సంచలన విజయం సాధించి దక్షిణాది చిత్రాలు, మన దర్శకుల శైలి, మన స్టార్ హీరోల మార్కెట్ సత్తా గురించి అందరూ మాట్లాడుకున్నారు... ఆ విధంగా తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధిని విస్తరింపచేయడంలో రత్నం గారి పాత్ర మరువలేనిది` అని అన్నారు.
`ఎవరినీ కూడా నాతో సినిమా చేయమని అడగలేదు. నేను హీరోగా వచ్చిన తొలి రోజుల్లో ఒక్క రత్నంని మాత్రమే అడిగాను. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రత్నం గారి బంధువు ఒకరు నాకు నెల్లూరులో సన్నిహిత మిత్రుడు. అలా రత్నం గారిని చెన్నైలో కలిసే వాడిని. అలా మరచిపోలేని హిట్ `ఖుషీ` ద్వారా ఆయన ఇచ్చారు. సినిమా నిర్మాణంపట్ల ఆయనలో ఒక తపన కనిపిస్తుంది. సినిమా వ్యాపార విస్తృతి తెలిసిన నిర్మాత ఆయన. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి అందించడం ద్వారా మార్కెట్ పరిధి పెంచారు. ఆయన నిర్మించే చిత్రాల్లో ప్రేక్షకుల అభిరుచికి తగ్గ అన్ని అంశాలూ ఉంటాయి. అవి ఏ భాషవారికైనా నచ్చేలా ఉంటాయి. ఆయన మున్ముందు మరిన్ని విజయాలను అందుకోవాలి` అని అన్నారు.
మరోవైపు దర్శకుడు క్రిష్ కూడా నిర్మాత ఏ.ఎం రత్నంకి బర్త్ డే విషెస్ తెలిపారు.