ఒకే ఫ్రేమ్లో బాలయ్య, పవన్.. వీరసింహారెడ్డి సెట్లో వీరమల్లు సందడి.. ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి?
అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. బాలయ్య సెట్కి పవన్ రావడం ఇప్పుడు ఫ్యాన్స్ ని ఊపేస్తుంది.
ఇద్దరు స్టార్లు ఒకే ఫ్రేములోకి వస్తే ఫ్యాన్స్ కి పూనకాలే. అదే ఇద్దరు మాస్ కి బాస్లైన సూపర్ స్టార్లు కలిస్తే అది అభిమానులకు కళ్ల సంబురం. అలాంటి అరుదైన దృశ్యం ఇప్పుడు చోటు చేసుకుంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. బాలయ్య సెట్కి పవన్ రావడం ఇప్పుడు ఫ్యాన్స్ ని ఊపేస్తుంది. ఇదే ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ విషయం.
బాలకృష్ణ నటిస్తున్న `వీరసింహారెడ్డి` సినిమా సెట్కి పవన్ కళ్యాణ్ రావడం విశేషం. ఈ అరుదైన దృశ్యం శుక్రవారం చోటు చేసుకుంది. బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటిస్తున్న `వీరసింహారెడ్డి` సినిమా సెట్కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` యూనిట్ సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్అవుతుంది.
ఇందులో బాలకృష్ణ, పవన్తోపాటు శృతి హాసన్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత రవిశంకర్ ఉన్నారు. బాలకృష్ణ, శృతి హాసన్పై ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సారథ్యంలో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ టీమ్ అక్కడ విజిట్ చేసి వారిని సర్ప్రైజ్ చేశారు. ఇది ఇప్పుడు అటు బాలయ్య అభిమానులను, ఇటు పవన్ అభిమానులను సంబరాల్లో మునిగిపోయేలా చేస్తుంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణ హోస్ట్ గా రన్ అవుతున్న `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2` షోకి పవన్ రాబోతున్నారనే వార్త తెలిసిందే. త్వరలోనే ఈ ఎపిసోడ్ని షూట్ చేయబోతున్నారట. దీనికోసమే పవన్ వచ్చారని తెలుస్తుంది. జనరల్గా ఇలాంటి ఓ టాక్ షోకి పవన్ రావడమనేది చాలా అరుదు. ఇటీవల కాలంలో అసలు జరగలేదు. ఇప్పుడు రాబోతున్నారనే వార్తతోనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ కలయిక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక `అన్స్టాపబుల్` షోతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.
బాలకృష్ణ నటిస్తున్న `వీరసింహారెడ్డి` చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి విడుదల కాబోతుంది. మరోవైపు పవన్ నటిస్తున్న `హరిహరవీరమల్లు` చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం రిలీజ్ కానుందని సమాచారం.