పాక్ లో భారత్ సినిమాలు నిషేధం!
పాకిస్తాన్ లో భారత్ సినిమాల విడుదలను నిషేధించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేపట్టారు.
పాకిస్తాన్ లో భారత్ సినిమాల విడుదలను నిషేధించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పాక్ కి చెందిన మూడు వందల మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
ఈ క్రమంలో భారత్ సినిమాల్ని నిషేధిస్తున్నట్లు పాకిస్తాన్ సమాచారం మంత్రి ఫవాద్ చౌదరి ప్రకటించారు. అంతేకాదు మేడిన్ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీకి సూచించారు.
దీనికి సంబంధించి ఫవాద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'భారత కంటెంట్ ను సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ బహిష్కరించింది. ఇక పాకిస్తాన్ లో భారత్ సినిమాలు విడుదల కావు. మేడిన్ ఇండియా ప్రకటనలకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ వ్యవహరించాలని సూచించాం' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
ఇక పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ.. పాకిస్తాన్ నటీనటులతో కలిసి పని చేయకూడదని భారత చిత్ర పరిశ్రమ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.