ఆపరేషన్ సిందూర్ పై మూవీ ప్రకటన, ఫస్ట్ పోస్టర్ ఇదే.. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే

Synopsis
ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్' సినిమా ప్రకటనతో వివాదం చెలరేగింది. సినిమా పోస్టర్ విడుదలైన వెంటనే నెటిజన్లు మేకర్స్ పై మండిపడ్డారు.
ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ చిల్లర దాడులు చేస్తూనే ఉంది, ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది. ఈలోగా, ఇండియా చేసిన 'ఆపరేషన్ సిందూర్' గురించి సినిమా తీయాలని ఫిలిం ఇండస్ట్రీలో పోటీ మొదలైంది. ఒక ఫిలిం మేకర్ సినిమా ప్రకటన కూడా చేసేశారు, పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు మేకర్స్ పై విరుచుకుపడ్డారు. యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో సినిమా ప్రకటన చేయడం సిగ్గుచేటని అన్నారు.
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల
విరల్ భయాని అనే పేజీలో ఈ సినిమా పోస్టర్ షేర్ చేశారు. పోస్టర్ లో 'ఆపరేషన్ సింధూర్' అనే టైటిల్ పైన 'భారత్ మాతా కీ జై' అని రాసి ఉంది. టైటిల్ కింద ఆర్మీ యూనిఫామ్ లో ఒక నటి చేతిలో గన్ పట్టుకుని, నుదుటన సింధూరం పెట్టుకుంటున్నట్టు చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో బార్డర్ దాటి జరుగుతున్న బాంబు దాడుల సీన్ ఉంది. "ఇండియా చేసిన ధైర్య సాహసాలతో కూడిన 'ఆపరేషన్ సిందూర్' సినిమా కోసం నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్ కలిసి పనిచేస్తున్నారు" అని పోస్టర్ షేర్ చేస్తూ రాశారు. ఉత్తమ్ మహేశ్వరి, నితిన్ కుమార్ గుప్తా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటుల గురించి ఇంకా సమాచారం లేదు.
'ఆపరేషన్ సిందూర్' సినిమా ప్రకటనపై నెటిజన్ల ఆగ్రహం
సినిమా పోస్టర్ చూసిన నెటిజన్లు మేకర్స్ ని తిట్టిపోస్తున్నారు. "యుద్ధం జరుగుతున్నప్పుడు AI జనరేటెడ్ పోస్టర్ వేయడం ఏమిటి? భయంకరంగా ఉంది" అని ఒకరు అన్నారు. "సిగ్గులేదు.. యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది" అని ఇంకొకరు అన్నారు. "ప్రొడక్షన్ కోసం డబ్బులు సంపాదించడానికి కొత్త టెక్నిక్" అని ఒకరు, "ఇలాంటి విషయాలను వాడుకోవడం మానేయండి. చాలా సిగ్గుచేటు" అని ఇంకొకరు అన్నారు. "ఎవరూ ముందుకొచ్చి మాట్లాడట్లేదు, కానీ సినిమా తీసి డబ్బులు సంపాదించడానికి రెడీ అయిపోయారు" అని ఒకరు, "ముందు యుద్ధం అయిపోనివ్వండి" అని ఇంకొకరు అన్నారు. "మీరందరూ పిచ్చోళ్లా? ప్రతి రాత్రి మేము భయంతో గడుపుతున్నాం. ఉదయం వెలుగు చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని దగ్గర పెట్టుకుని పడుకుంటున్నాం. దయచేసి మా భావాలతో ఆడుకోకండి" అని ఒకరు అన్నారు.