నాగబాబుకి కలిసిరాని ‘మెగా’ హీరోలు
అప్పుడు చెర్రీ.. ఇప్పుడు బన్నీ..
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలే వచ్చారు. వారంతా నిలదొక్కుకున్నారు కూడా. వీరంతా సినిమా పరిశ్రమను ఏలడానికి ముఖ్య కారణం మెగాస్టార్ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కి స్టార్ డమ్ వచ్చిన కొత్తలో ఆయన సోదరుడు నాగబాబు కూడా హీరోగా నటించారు. కానీ నిలదొక్కుకోలేకపోయారు. అలా అని సినిమాలకు మాత్రం దూరం కాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు దక్కించుకున్నారు.
తండ్రి, మామ, బాబాయి ఇలా రకరకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. జబర్ధస్త్ లాంటి టీవీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కానీ ఒక్క విషయంలో మాత్రం నిరాశకు గురౌతున్నారు. నిర్మాతగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు.
మెగా హీరోలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రతిసారీ నాగబాబుకి ఎదురు దెబ్బే తగులుతోంది. గతంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ ఆరెంజ్’ సినిమాకి నాగబాబే నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా కారణంగా ఆయన చాలానే నష్టపోయారు. ఈ విషయంలో చిరంజీవి తమ్ముడుకి సహాయం చేయకపోగా.. ఎందుకు నిర్మాతగా మారావు అంటూ తిట్టినట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేసాయి. అంతేకాదు.. పవన్ కళ్యాణ్.. దాదాపు రూ.20కోట్లు ఇచ్చి నాగబాబుని ఆదుకున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ నష్టాల నుంచి ఇలా కోలుకున్నాడో లేదో మరోసారి నష్టాలకు ఎదురెళ్లారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా శుక్రవారం విడుదలైన ‘ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాకి కూడా నాగబాబే నిర్మాతగా వ్యవహరించారు.మొత్తం సినిమాకి ముగ్గురు నిర్మాతలు కాగా.. వారిలో నాగబాబు ఒకరు. కాగా.. ఈ సినిమా ఫస్ట్ టాక్ యావరేజ్ అని వినపడుతోంది. ఈ లెక్కన మరోసారి నాగబాబు కష్టాల్లో పడినట్టేనా అనే వాదనలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా మెగా హీరోల సినిమాలు నాగబాబుకి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి.