డిస్నీ, పిక్సార్‌ సంస్థల నుంచి `ఎలిమెంటల్‌` అనే యానిమేషన్‌ మూవీ రాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ యానిమేషన్‌ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ నుంచి ఓ కొత్త డిమాండ్‌ వినిపిస్తుంది.

సినిమాకి హద్దులు చెదిరిపోయాయి. మంచి సినిమా ఏ భాషలో ఉన్నా చూస్తున్నారు. అందులో భాగంగా యానిమేషన్‌ చిత్రాలకు మరింత ఆదరణ పెరుగుతుంది. హాలీవుడ్‌లో డిస్నీ లాంటి సంస్థలు నిర్మించే యానిమేషన్‌, యాక్షన్‌ మూవీస్‌కి ఇండియాలో విశేష ఆదరణ దక్కుతుంది. ఇక్కడ ఆయా సినిమాలు రిలీజ్‌ అయితే వందల కోట్ల కలెక్షన్లు వస్తుండటం విశేషం. త్వరలో డిస్నీ,పిక్సార్‌ నుంచి `ఎలిమెంటల్‌` అనే యానిమేషన్‌ మూవీ రాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఇది చిన్న పిల్లలకు బాగా నచ్చుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 

ఇదిలా ఉంటే ఈ యానిమేషన్‌ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ నుంచి ఓ కొత్త డిమాండ్‌ వినిపిస్తుంది. ఈ సినిమాలోని ఏదైనా పాత్రకి తెలుగులో ఎన్టీఆర్‌ చేత డబ్బింగ్‌ చెప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో డబ్‌ చేయాలని, అందులో ఓ పాత్రకి తారక్‌ వాయిస్‌ ఇస్తే బాగుంటుందంటున్నారు. ఎన్టీఆర్‌ వాయిస్‌తో ఈ సినిమాని తెలుగులో చూస్తే అద్భుతంగా ఉంటుంది, ఆ దిశగా ప్లాన్‌ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. 

తెలుగు వారే కాదు, ఇండియా వైడ్‌గా ఉన్న అభిమానుల నుంచి ఈ డిమాండ్‌ వినిపిస్తుండటం విశేషం. అంతేకాదు దీన్ని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. ట్విట్టర్‌ మాధ్యమాల్లో దీన్ని ట్రెండ్‌ చేస్తుండటం విశేషం. మరి అభిమానుల కోరిక, డిమాండ్‌ని మేకర్స్ నెరవేరుస్తారా? ఎన్టీఆర్‌ అందుకు ఒప్పుకుంటాడా? అనేది పెద్ద సస్పెన్స్. ఒకవేళ ఇది సాధ్యమైతే `ఎలిమెంటల్‌` యానిమేషన్‌ ఫిల్మ్ ఇండియన్‌ వైడ్‌గా విశేష ఆదరణ పొందుతుందని చెప్పొచ్చు.ఈ సినిమా జూన్‌ 16న విడుదల కానుంది. అదే రోజు ఇండియాలో ప్రభాస్‌ `ఆదిపురుష్‌` రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ తన `ఎన్టీఆర్‌30`లో నటిస్తున్నారు. దీనికి తాజాగా `దేవర` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు తారక్‌ ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. నల్లని దుస్తులు ధరించి చేతిలో ఆయుధం పట్టుకుని సముద్రంలో రాళ్లపై నిల్చొని కోపంగా చూస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌ వాహ్‌ అనేలా ఉంది. ఈ సినిమా ఎంత మాస్‌గా రూపొందుతుందో ఈ ఒక్క పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇది సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.