ఎన్టీఆర్ జయంతి... ఆసక్తి రేపుతున్న చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్స్!
నేడు ఎన్టీఆర్ జయంతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కీర్తిని స్మరించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
లెజెండ్ నందమూరి తారకరామారావు కీర్తిని కొనియాడుతూ మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు. ''కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను''అని చిరంజీవి కామెంట్ చేశారు.
చిరంజీవితో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ చిత్రాల్లో నటించారు. విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని అనంతరం చిరంజీవి కైవసం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో చిరంజీవి-ఎన్టీఆర్ కలిసేవారు. ఎన్టీఆర్ తో దిగిన ఓ అరుదైన ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు.
ఇక ఎన్టీఆర్ నటవారసుడిగా వెండితెరకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ ఒక భావోద్వేగ కామెంట్ చేశారు. ''మీ పాదం తగలక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది... మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది... పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెను ఒకసారి తాకిపో తాతా'' అని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. నేడు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు. పుష్ప గుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు.
నందమూరి ఫ్యాన్స్ లో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు అభిమానులు ఒకవైపు... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోవైపు చేరారు. ఇటీవల టీడీపీ నేత బుద్దా వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యేలా కామెంట్స్ చేశారు. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు.ఎప్పటికైనా టీడీపీకి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని ఒక వర్గం వాదిస్తుంది.