నిత్యా మీనన్ కాలుకు గాయం.. నడవలేని స్థితిలో స్టార్ హీరోయిన్.. ఎలా జరిగింది?
ప్రత్యేక పరిచయం అవసరం లేని టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్.. తాజాగా ఈమె కాలుకు పెద్ద గాయం అయ్యింది. దీంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇంతకీ ఎలా జరిగిందని కంగారు పడుతున్నారు..
`
‘అలా మొదలైంది..’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మెరుపులు మెరిపించింది నిత్య మీనన్ (Nithya Menen). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసి దూకుడు చూపించిన స్టార్ హీరోయిన్.. ఆతరువాత కాస్తా డల్ అయ్యింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్తో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది నిత్యా మీనన్. భీమ్లానాయక్ లో పవన్ భార్యగా అలరించింది. గతంలో నితిన్ సరసన నటించిన ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతు అయ్యిందే’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ప్రస్తుతం నిత్యా మీనన్ అడపా దడపా స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. అలాగే రెండేండ్ల నుంచి పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోందీ బ్యూటీ. అయితే తను నటించిన ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ (Modern Love Hyderabad) వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. జూలై 8న వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లోనే వెబ్ సిరీస్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ప్రొగ్రామ్ కు హాజరైన నిత్యామీనన్ అందరికీ షాక్ ఇచ్చింది. నడవలేని స్థితిలో కార్యక్రమానికి హాజరై తన అభిమానులను కంగారు పెట్టింది. వేదికపై కర్రసాయం మరియు బాడీ గార్డ్స్ సాయంతో నడుచుకుంటూ రావడంతో అసలేమైందనీ అందరూ ఆందోళన చెందారు. ఇందంతా ప్రమోషన్ లో భాగామేనా అని సందేహించారు. కానీ నిజంగానే నిత్యా మీనన్ కాలుకి గాయం అయ్యింది. ఇంట్లో జారి పడటంతో కుడి కాలుకు దెబ్బ బలంగా తాకింది. అయినా ఈవెంట్ కు హాజరవడం విశేషం. ఇదే కార్యక్రమానికి నటీనటులు నరేష్, సుహాసిని మణిరత్నం, అభిజీత్ తదితర హీరోయిన్లు పాల్గొన్నారు.
ఇక ఇటీవలనే నిత్యామీనన్ య్యూటూబ్ లో ఛానెల్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అటు సినిమాలు చేస్తూనే.. ఇటు వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోస్, పలు టెలివిజన్ షోలతోనూ అలరిస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ లో కనిపిస్తున్న నిత్యామీనన్ అటు సింగింగ్ కాంపిటీషన్ ‘తెలుగు ఇండియన్ ఐడల్’లో జడ్జీగా వ్యవహరిస్తోంది. గతంలోనూ నిత్యా మీనన్ పలు చిత్రాలకు అద్భుతమైన గాత్రం అందించింది.