అనుకున్నంతా అయ్యింది....ఓటీటికి ‘టక్ జగదీష్’
గురువారం నాడు చిత్రం టీమ్ నిర్వహిస్తున్న సమావేశంలో “టక్ జగదీశ్”ను ఓటీటీలో రిలీజ్ చేయాలా? థియేటర్లలో రిలీజ్ చేయాలా? అనేది తేలనుంది. వీలైతే ఈ మీట్ లోనే రిలీజ్ డేట్పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హిట్ కాంబినేషన్ నాచురల్ స్టార్ నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఎప్పుడో పూర్తైన ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రారంభం రోజు నుంచి మంచి ఎక్సపెక్టేషన్స్ సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారనటంలోనూ సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్స్ వచ్చేసి ఆదరణ చూరగొన్నాయి.
వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల అవుతుందని చిత్ర టీమ్ ప్రకటించింది. అయితే ఓ వైపు కరోనా థర్డ్ వేవ్ భయాలు, జనం థియేటర్స్ కు రాకపోవటం, మరోవైపు ఆంధ్రాలో టికెట్ రేట్స్ సమస్య కాలేకపోవటంతో ఏం చేయాలో అర్దం కాని పరిస్దితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ బాట పట్టనుందని తాజా సమాచారం.
దానికి తోడు ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్ను ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరక్ట్ ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు వినికిడి. దీంతో టక్ జగదీష్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ విషయమై ఈ రోజు ప్రెస్ మీట్ జరగనుంది. ఇక ఈ సినిమానకు థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నాజర్, జగపతి బాబు, రావు రమేష్, వీకే నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: తమన్, కళ: సాహి సురేష్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల.