ఎన్టీఆర్ కుటుంబంలో ఆ విషాదం జరిగి రెండేళ్లు..!
నందమూరి కుటుంబంలో టైగర్ గా పేరున్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన సంగతి తెలిసిందే. నేటితో హరికృష్ణ మరణించి రెండేళ్లు అవుతుంది. ఆయన రెండవ వర్థంతి సంధర్భంగా కుటుంబ సభ్యులు ఆయనను స్మరించుకుంటున్నారు.
రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2018 ఆగష్టు 29న నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పొందారు. హైదరాబాద్ నుండి నెల్లూరుకు ఓ స్నేహితుడి ఆహ్వానం మేరకు మిత్రులతో కలిసి వెళుతున్న హరికృష్ణ కారు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న టొయోటా ఫార్చూనర్ వేగంగా రోడ్డు డివైడర్ ని ఢీ కొట్టడం జరిగింది. హరికృష్ణ సీటుబెల్ట్ ధరించక పోవడంతో తీవ్రగాయాల గురై మరణించడం జరిగింది.
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న హరికృష్ణ అకాల మరణం జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లను ఎంతగానో కలచి వేసింది. తండ్రితో ఘాడమైన అనుబంధం ఉన్న ఎన్టీఆర్ ఈ సంఘటన నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆయన మరణం తరువాత జరిగిన అరవింద సమేత ఆడియో వేడుకలో తండ్రిని తలచుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు నాన్నతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకొని చాల బాధపడ్డారు.
2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఆయన విజయవాడ వెళుతుండగా రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ని ఢీ కొట్టడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఆయన మరణనాన్ని పూర్తిగా మరవక ముందే నాలుగేళ్ళ వ్యవధిలో మరో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నేడు హరికృష్ణ రెండవ వర్థంతి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్మరించుకుంటున్నారు.