నాగచైతన్య.. `ఆరంభం` సినిమాకి సపోర్ట్ చేశాడు. ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. మరోవైపు టాలీవుడ్లో కొత్తగా ఎన్నికైన డైరెక్టర్ అసోసియేషన్ కొలువుదీరింది.
నాగ చైతన్య ప్రస్తుతం `తండేల్` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఓ షెడ్యూల్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన మరో సినిమాకి సపోర్ట్ చేశారు. `ఆరంభం` అనే చిత్రానికి తనవంతు సహకారం అందిస్తూ టీజర్ని విడుదల చేశాడు. ఆసక్తికరంగా సాగే ఈ టీజర్ వైరల్ అవుతుంది. యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. మరి ఇందులో ఏముంది? `ఆరంభం` కథేంటి అనేది చూస్తే,
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలతో `ఆరంభం` రూపొందుతుంది. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి
నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా టీజర్ ను శుక్రవారం నాగ చైతన్య రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న నాగ చైతన్య మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. ఆయన మాట్లాడుతూ, థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో "ఆరంభం" టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ లో గ్రే షేడ్స్ ఉన్నాయి. విజువల్స్, మ్యూజిక్ కొత్తగా ఉన్నాయి. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో రామాయణ స్టోరీ నెరేట్ చేస్తూ ఇంటర్ కట్స్ లో వేసిన విజువల్స్ తో కూడిన టీజర్ డిఫరెంట్ గా కట్ చేశారు` అంటూ టీమ్కి అభినందనలు తెలిపారు చైతూ.
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా వినని ఒక కథ చెబుతానంటూ ఒక మహిళ చెప్పే కథతో `ఆరంభం` టీజర్ మొదలైంది. శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. హనుమంతుడు తనను వెళ్లనివ్వడని తెలిసి శ్రీరాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో జారవిడుస్తాడు. ఆ ఉంగరం తెచ్చేందుకు హనుమంతుడు పుట్టలోకి వెళ్లడం, అలా వెళ్తూ పాతాళలోకం చేరుకుంటాడు. అక్కడ వాసుకి హనుమంతుడికి దారి చూపించడం జరుగుతుంది. హనుమంతుడికి పాతాళలోకంలో అనేక ఉంగరాలు కనిపిస్తాయి. వీటిలో శ్రీరాముడి ఉంగరం ఏదని వాసుకిని హనుమంతుడు అడగగా..ఇవన్నీ శ్రీరాముడివే అని వాసుకి చెబుతుంది. ఈ కథ వాయిస్ ఓవర్ వస్తుండగా...`ఆరంభం` టీజర్ లో జైలు, ఒక కేసు వివరాలు, ఇతర క్యారెక్టర్స్, జరగనివి జరిగినట్లు అనిపించే డెజావు ఏంటి అనే అంశాలు చూపించారు. ఇవన్నీ టీజర్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టీమ్ తెలిపింది.
కొలువుదీరిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం..
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో దర్శకుడు వీరశంకర్ ప్యానెల్ సభ్యులు గెలుపొందారు. ఎన్నికైన నూతన కార్యవర్గం నేడు 16 ఫిబ్రవరి శుక్రవారం, రథసప్తమి పర్వదినాన దర్శకుల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా, గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారంభించామని, మా సభ్యులు మాకిచ్చిన అతికొద్ది కాలంలోనే మా సంఘాన్ని TFDA 2.0గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సాయిరాజేష్, వశిష్టలతో పాటు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, కోశాధికారి రామారావు, సంయుక్త కార్యదర్శులు వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రియదర్శిని, వంశీ దొండపాటి, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా, సీనియర్ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ క్రిష్ణమోహన్, కూరపాటి రామారావు,ఆకాష్, లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ పాల్గొన్నారు.
