‘లవ్స్టోరి’ : రెండు రకాల క్లైమాక్స్లు,రీషూట్ లపై నాగచైతన్య ఏమన్నారంటే
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్స్టోరి’. ఈ ప్రేమకథని సెప్టెంబరు 24న తెలుగు రాష్ట్రాలతోపాటు యూకేలోనూ విడుదల చేసారు. సుమారు రెండేళ్ల తర్వాత యూకేలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రమిదే . శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. పవన్ సి.హెచ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
శేఖర్ కమ్ములతో చైతు హీరోగా నటించిన తొలి చిత్రం ‘లవ్స్టోరి’. ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా పరిశ్రమంతా ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ. మొన్న శుక్రవారం నుంచి ప్రేక్షకులను పలకరిస్తోందీ సినిమా. లవ్ స్టోరీ చిత్రం ప్రధానంగా కుల వివక్ష నేపథ్యంలో సాగింది. ఇక రిలీజ్ కు ముందు గత కొన్ని రోజులుగా లవ్ స్టోరీ గురించి రెండు క్లైమాక్స్ లు శేఖర్ కమ్ముల చిత్రీకరించాడని వార్తలు వచ్చాయి. ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ ను, ఒక హ్యాపీ ఇన్సిడెంట్ ను కమ్ముల చిత్రీకరించాడని అన్నారు. ఆ విషయమై నాగచైతన్య మాట్లాడారు.
నాగచైతన్య మాట్లాడుతూ..అలాంటిదేమీ లేదు. ఒక క్లైమాక్స్ మాత్రమే తెరకెక్కించాం. లాక్డౌన్ సమయానికి షూట్ దాదాపు పూర్తయింది. ఆ తర్వాత 6,7 నెలల సమయం దొరికింది. క్లైమాక్స్ సీన్స్ మరింత మెరుగ్గా ఉండాలని, అదే క్లైమాక్స్ని కొన్ని మార్పులతో మళ్లీ తెరకెక్కించారు. ఇంత ఎక్కువ సమయం దొరకడంతో డబ్బింగ్పైనా ఎక్కువ దృష్టి పెట్టే వీలుచిక్కింది. తెలంగాణ యాస కోసం పాటలు, వీడియోలు ఎక్కువ చూశాను.
అలాగే ఇప్పుడు సినిమాల ట్రెండ్ మారింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తోంది. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలను ఎక్కువగా ఆశిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా ఓ సారి మాట్లాడుతూ ఇదే అన్నారు. మనం కొత్తగా చేయడానికి వెనకాడతాం కానీ, ప్రేక్షకులు ఆదరించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారన్నారు. అందుకే కథాంశం విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాను అన్నారు.
ఇక పాన్ ఇండియా మార్కెట్ నాకు తెలియదు. ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్ మీదే ఉంది. తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేయాలని ఉంది. పాన్ ఇండియా స్థాయిలో కథ రాసుకుంటే, స్థానికంగా ఉండే మూలాలు దెబ్బతింటుందేమో అని నా అభిప్రాయం. కానీ హిందీలో మంచి అవకాశాలు వస్తే మాత్రం చేసేందుకు వెనకాడను అన్నారు.
శేఖర్ కమ్ముల గురించి చెప్తూ... శేఖర్ కమ్ముల మంచి విలువలున్న వ్యక్తి. సెట్ బాయ్ నుంచి హీరోహీరోయిన్ల వరకు అందరినీ ఒకే రకంగా చూస్తారు. ఇదంతా కావాలని చేయరు. ఆయన వ్యక్తిత్వమే అలాంటిది. శేఖర్తో నిరంతరం ప్రయాణించాలని, ఆయనతోనే ఉండిపోవాలనే భావనను కలిగిస్తారు. అందుకే ఈ సినిమా కోసం 200 రోజులైనా పని చేయొచ్చనిపించింది. అంతగా ప్రభావితం చేశారు. శేఖర్లో కనిపించే అంకితభావం, నిజాయతీ ఇంకెవరిలో చూడలేదు. ప్రతి చిన్న విషయాన్ని చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నటుడిగానూ ఎక్కువగా నేర్చుకునే వీలుంటుంది అన్నారు.