Asianet News TeluguAsianet News Telugu

డబ్బుల కోసం రాజమౌళి వద్ద అసలు నిజం దాచిన `నాటునాటు` కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌.. ఏం చేశాడంటే?

రాజమౌళి సినిమాలకు పనిచేయడానికి ముందు తన స్థితి గురించి వెల్లడించారు `నాటునాటు` కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌. పెద్ద సీక్రెట్‌ దాచి డబ్బు కోసం ఆ పనిచేశారట మాస్టర్‌.

naatu naatu choreographer prem rakshit master revealed secret regards rajamouli
Author
First Published Mar 20, 2023, 2:07 PM IST

కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ పేరు ఇప్పుడు ఇండియా వైడ్‌గానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. `నాటు నాటు`లో హుక్‌ స్టెప్‌ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ట్రెండ్‌గా మారింది. సాధారణ ప్రజల నుంచి, సెలబ్రిటీల వరకు ఈ హుక్‌ స్టెప్‌ వేస్తూ వీడియోలు పంచుకుంటున్నారు. ఆస్కార్‌ వేడుకలోనూ స్టేజ్‌పై ఈ పాటని ప్రదర్శించారు. దీనికి సెలబ్రిటీలంతా స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ఇంతటి క్లిష్టమైన స్టెప్‌ ఎలా సాధ్యమని, ఈ ఐడియా క్రియేట్‌ చేసిన కొరియోగ్రాఫర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. `నాటు నాటు`కి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు రావడంలో ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ స్టెప్పులే మెయిన్‌ రీజన్‌ అని చెప్పొచ్చు. 

అయితే ఈ సందర్భంగా ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ ఓపెన్‌ అయ్యారు. అసలు రాజమౌళి వద్ద పనిచేయకు ముందు తన దీన పరిస్థితిని వెల్లడించారు. ఎంతటి స్ట్రగుల్స్ పడ్డాడో తెలిపారు. మూడు పూటల భోజనం చేసే పరిస్థితి లేదు, మూడు రోజులకోసారి  భోజనం చేసే పరిస్థితి నుంచి వచ్చామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఓ పెద్ద సీక్రెట్‌ని బయటపెట్టారు ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూ(టీవీ9)లో తన గతం గురించి ఓపెన్‌ అయ్యారు. బిగినింగ్‌ డేస్‌లో డబ్బుల కోసం ఇబ్బంది పడినట్టు చెప్పారు. సర్వైవల్‌ కోసం డబ్బులు ఉండేవి కావని అందుకే డాన్సు ట్రైనర్‌గా పనిచేశానని వెల్లడించారు. 

రాజమౌళి వద్ద పనిచేయడానికి ముందు హైదరాబాద్‌లోని కృష్ణనగర్‌లో ఉండేవాడిని అని, రాజమౌళి, కీరవాణి తనయులు కార్తికేయ, భైరవ(కాల), సింహాలకు డాన్సు నేర్పించేవాడట. వీరితోపాటు మరో ఇద్దరికి తాను డాన్సు నేర్పించే వాడినని అని, అలా రోజూ రాజమౌళికి ఇంటికి వెళ్లేవారట. అక్కడ కార్తికేయ, భైరవ, సింహాలకు డాన్సు నేర్పించినట్టు చెప్పారు. కడుపునిండా భోజనం చేయాలంటే వారింట్లోనే అని, వెళ్లగానే ఏరా తిన్నావా అంటూ రమా రాజమౌళి భోజనం పెట్టేవారని తెలిపారు. రెండు మూడు రోజులకు సరిపడేలా అక్కడే భోజనం చేసేవాడినని తెలిపారు. 

అయితే రాజమౌళికి ఆ సమయంలో తాను ఎవరో తెలియదని, జస్ట్ డాన్సు ట్రైనర్‌గానే తెలుసు అని తెలిపారు. డబ్బుల కోసం తాను కొరియోగ్రాఫర్‌ అనే నిజాన్ని దాచినట్టు వెల్లడించారు.  నిజం తెలిస్తే అంత ఫ్రీగా ఉండేవాడిని కాదని, ఆ గ్యాప్‌ ఉంటుందని, పైగా తనని తీసేసే అవకాశం కూడా ఉంటుందనే భయంతో అసలు విషయం చెప్పలేదన్నారు. తనకు ఆ సమయంలో డబ్బులు అవసరం అని, చెన్నైలో ఉన్న అమ్మానాన్నకి నెల నెల మూడు వేలు పంపించాలి, తాను ఇక్కడ రెంట్లు, అవకాశాల కోసం తిరిగేందుకు పెట్రోల్‌ కి డబ్బులు కావాలని, అందుకే డాన్స్‌ ట్రైనర్‌గా చేశానని తెలిపారు. 

అప్పటికే తాను `నందిని`, ఆర్‌ బి చౌదరీ నిర్మించిన `విద్యార్థి` చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశాను. అవి రిలీజ్‌ కూడా అయ్యాయి. ఓ రోజు రాజమౌళి ఇంట్లో పైన హోం థియేటర్లో `విద్యార్థి` చిత్రంలోని పాట వినిపిస్తుంది. నాదేనా అనే డౌట్‌ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వినిపించింది. దీంతో ఆగలేక పైకి వెళ్లాను. అప్పుడే రాజమౌళి రూమ్‌లో నుంచి బయటకు వస్తున్నారు. సర్‌ ఆ పాట చేసింది నేనే అని చెప్పా. ఆయన నమ్మలేదు. ఆర్‌బీ చౌదరీకి ఫోన్‌ చేసి అడిగితే ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఏంటీ ఇలా అని అడిగారని, అప్పుడు నా పరిస్థితి చెప్పానని, దీంతో ఆయన అప్పట్నుంచి తనతోనే ట్రావెల్‌ చేయించారని చెప్పారు. మొదటగా `సై` సినిమాకి పనిచేశానని, `విక్రమార్కుడు`, `యమదొంగ`, ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నాటు నాటు వరకు ఆయనతో ట్రావెల్‌ అవుతున్నానని తెలిపారు. `నాటు నాటు`కి ఆస్కార్‌ రావడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో నాటునాటు పాటని ఉక్రెయిన్‌ లోని ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో షూట్‌ చేశారు. ఇందులో 150 మంది డాన్సర్లు పాల్గొన్నారు.దీనికోసం సెట్‌లో ప్రతి రోజు మూడు గంటలపాటు రిహార్సల్స్ చేసేవారట. హుక్‌ స్టెప్ప్ కోసం ఎన్నో టేకులు తీసుకున్నారట ఎన్టీఆర్‌, చరణ్‌. దాదాపు 17 రోజులపాటు ఈ ఒక్కసాంగ్‌ నే షూట్‌ చేశారట. అయితే ఆస్కార్‌ ఈవెంట్‌లో ప్రదర్శన కోసం మరోసారి ఆయన ఈ డాన్సు ని కంపోజ్‌ చేశారట. ఇప్పుడీ పాట సోషల్‌ మీడియాలో దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios