మైసూర్ సాండల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా నియామకం పై వివాదం చెలరేగింది. దీనిపై నటి రమ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైసూర్ సాండల్ సోప్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్ నియామకం పై కన్నడ సంఘాలు, కన్నడిగులు నిరసన తెలియజేస్తున్నారు. నటి తమన్నాని రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. కర్ణాటక ఉత్పత్తికి బయటి నటి ఎందుకు? కన్నడ నటీనటులు ఉండగా బయటి వారిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సాండల్ వుడ్ క్వీన్ రమ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కన్నడిగ మైసూర్ సాండల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడరే. సోప్ వాడే ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్లే. మరి తమన్నాకి కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

టాక్స్ పేయర్స్ డబ్బులు బ్రాండ్ అంబాసిడర్ కి ఇవ్వడం తప్పు

మైసూర్ సాండల్ సోప్ ప్రచారం, బ్రాండ్ అంబాసిడర్ నియామకం పై రమ్య సోషల్ మీడియాలో స్పందించారు. ఇప్పుడు ప్రచారానికి చాలా మార్గాలున్నాయి. అందరికీ సులభంగా తెలియజేయొచ్చు. పాత కాలం నాటి బ్రాండ్ అంబాసిడర్ పద్ధతి ఇప్పుడు అవసరం లేదు. టాక్స్ పేయర్స్ డబ్బులు బ్రాండ్ అంబాసిడర్ కి ఇవ్వడం తప్పు అని అన్నారు.

సెలబ్రిటీలను చూసి వస్తువులు కొనే రోజులు పోయాయి

ఇప్పుడు కాలం మారింది. సెలబ్రిటీలను చూసి వస్తువులు కొనే రోజులు పోయాయి. మంచి ఉత్పత్తి అయితే జనాలు కొంటారు. మైసూర్ సాండల్ సోప్ మంచి క్వాలిటీ ఉత్పత్తి. దానికి చరిత్ర ఉంది. ఘనత, పాపులారిటీ రెండూ ఉన్నాయి. ప్రతి కన్నడిగ మైసూర్ సాండల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడరే అని రమ్య అన్నారు.

ఆపిల్ కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్?

పెద్ద పెద్ద కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లు లేరు. ఆపిల్ కి ఎవరూ లేరు. కానీ ఆపిల్ సక్సెస్ ఫుల్ గా ఉంది. బ్రాండ్ అంబాసిడర్ తోనే పాపులారిటీ, అమ్మకాలు పెరుగుతాయనుకోవడం తప్పు అని రమ్య అన్నారు.6.2 కోట్ల రెమ్యునరేషన్ తో తమన్నాని ప్రభుత్వం మైసూర్ సాండల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.