వైయస్ జగన్ పాలనపై కీరవాణి సెటైర్లు
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు.. తన మరణాన్ని, తన మృత్యువునీ ఆపి ఉత్తరాయణం వచ్చేంత వరకూ వాయిదా వేశారు.
![Music director MM Keeravani satires on YS Jagan jsp Music director MM Keeravani satires on YS Jagan jsp](https://static-ai.asianetnews.com/images/01j1czk6ykvsxva5bkg7adq8wv/keeravani-jpg_363x203xt.jpg)
కీరవాణి ముక్కు సూటి మనిషి. అదే సమయంలో ఎలాంటి వివాదాలకు ఆయన చోటివ్వరు. తన పనేదో తనేంటో అనేదే చూసుకుంటూ ముందుకు వెళ్తూంటారు. అలాంటి ఆయన కూడా వైయస్ జగన్ పాలనపై సెటైర్లు వేయటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్బంగా కీరవాణి మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు.
రామోజీరావుని గుర్తుకొనే క్రమంలో కీరవాణి.. మాట్లాడుతూ... ”బతికితే రామోజీరావులా బతకాలని ఓ సభలో అన్నాను. మరణించినా ఆయనలానే మరణించాలి అని ఇప్పుడు అంటున్నాను. ఎందుకంటే.. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు.. తన మరణాన్ని, తన మృత్యువునీ ఆపి ఉత్తరాయణం వచ్చేంత వరకూ వాయిదా వేశారు. అదే విధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్ర ప్రదేశ్ కబంద హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్లారా చూసి, అప్పుడు నిష్క్రమించారు. అందుకే మరణించినా ఆయనలా మరణించాలి” అంటూ పరోక్షంగా జగన్ సర్కారుపై తన నిరసన వ్యక్తం చేశారు.
అలాగే ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుపై బురదజల్లడమంటే.. నడినెత్తున సూర్యుడిపై వేయడమేనని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అన్నారు. తనకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది రామోజీరావేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దేవుడిని నమ్మని రామోజీరావు ఫొటో తన పూజ గదిలో ఉంటుందన్నారు. మద్యపాన నిషేధం ఉద్యమానికి పాటలు రూపకల్పనలో ఆయనందించిన సహకారం మరువలేదని చెప్పారు.
కీరవాణి చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అదే సభలో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. తెలుగువారి కోసం ఎంతో చేసిన రామోజీరావుకు మనం ఏం చేయగలమన్నారు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్జప్తి చేశారు.
గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, రాజమౌళి, నిర్మాతలు అశ్విని దత్, సురేశ్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ నటి జయసుధ, సంగీత దర్శకుడు ఎం ఏం కీరవాణితోపాటు టాలీవుడ్లోని పలువురు ప్రముఖులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరయ్యారు.