`సీతారామం` చిత్రంలో సీతగా నటించి ప్రేక్షక హృదయాలను దోచుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ఇప్పుడు అంతర్జాతీయ ఆడియెన్స్ ని కట్టిపడేయబోతుంది. కాన్స్ వేడుకలో పాల్గొనబోతుంది. 


`సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ అరుదైన గుర్తింపుని దక్కించుకుంది. ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫెస్టివల్‌ కాన్స్ లో పాల్గొనే అవకాశం వరించింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ కాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మృణాల్‌ పాల్గొని సందడి చేయబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఆమె వెల్లడించింది. తన సంతోషాన్ని పంచుకుంది. చాలా థ్రిల్లింగ్‌గా ఉందని, గ్లోబల్‌ ఫిల్మ్ మేకర్స్ ని ఇంటరాక్ట్ కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కొత్త అవకాశాలు దక్కించుకోవడానికి,ప్రతిభని ప్రదర్శించడానికి ఇది మంచి వేదిక. కాన్స్ లో పాల్గొనేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. 

ఇప్పటికే ఇండియాకి చెందిన తారలు(హీరోయిన్లు) కాన్స్ లో మెరిశారు. తీరైన ట్రెండీ వేర్స్ ధరించి రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయారు. ప్రపంచసినీ ప్రేక్షకులు, సెలబ్రిటీలు వీక్షించగా, అందరి ముందు అందమైన దుస్తులు ధరించి వయ్యారాలు ఒలకబోశారు. వారిలో ఐశ్వర్య రాయ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, సోనమ్‌ కపూర్‌, కంగనా రనౌత్‌, హ్యూమా ఖురేషి, కత్రినా కైఫ్‌, పూజా హెగ్డే వంటి భామలు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. 

ఇప్పుడు మొదటిసారి సీతారామం బ్యూటీ మృణాల్‌కి ఈ ఛాన్స్ రావడం విశేషం. నేడు(మే 16)సాయంత్రం నుంచి ఈ వేడుక ప్రారంభమవుతుంది. మే 27 వరకు కొనసాగుతుంది. దాదాపు 12రోజులపాటు ఈ వేడుక జరుగుతుంది. మృణాల్ ఏ రోజు రెడ్‌ కార్పెట్‌పై సందడి చేయబోతుందనేది తెలియాల్సి ఉంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ సినిమాలు ప్రదర్శిస్తారు. సినిమా రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీ, కొత్త కంటెంట్‌ని ప్రపంచానికి తెలియజేయడం, సమాంతర సినిమా అభివృద్ధి, టాలెంట్‌ని పరిచయం చేయడం ప్రధానంగా సాగే ఈ వేడుకకి ప్రపంచంలోనే విశేష గుర్తింపు ఉంటుంది. ఇక్కడ సినిమాలకు అవార్డుల కంటే రెడ్‌ కార్పెట్‌పై సందడి చేయడమే మెయిన్‌ ఎట్రాక్షన్‌గా భావిస్తుంటారు. 

ఇక మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం `నాని30` చిత్రంలో నటిస్తుంది. శృతి హాసన్‌ మరో కథానాయికగా కనిపించబోతుంది. దీంతోపాటు హిందీలో `పూజా మేరీ జాన్‌`, `పిప్పా`, `లస్ట్ స్టోరీస్‌ 2`లోనూ నటించబోతుంది. తెలుగులోనూ ఆమెకి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆచితూచి వ్యహరిస్తుందట ఈ బ్యూటీ.