చిరంజీవి సినిమాపై వైసీపీ నేత ట్వీట్... జనసైనికుల ముఖ చిత్రం ఏమిటో!
చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధమైంది. దసరా బరిలో దిగుతున్న ఈ మూవీకి వైసీపీ నేత విజయ సాయి రెడ్డి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
గాడ్ ఫాదర్ మరో రెండు వారాల్లో థియేటర్స్ లో దిగనుంది. దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ రూపొందించారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్ర తెలుగులో చిరంజీవి చేస్తున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతుండగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా చిరంజీవి చిత్రంపై స్పందించారు. విజయ సాయి రెడ్డి తన ట్వీట్ లో ''మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండటం సంతోషకరం. ఆయనకు నా శుభాకాంక్షలు. నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజిపజేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం... ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం'' అని పొందుపరిచారు.
వైసీపీ నేత విజయసాయి రెడ్డి చిరంజీవి చిత్రానికి శుభాకాంక్షలు చెప్పడం విశేషంగా మారింది. జనసేన నేతలు, చిరంజీవి బ్రదర్స్ ఈ విజయసాయి రెడ్డి అంటే మండిపడతారు. వాళ్లకు విజయ సాయి రెడ్డి అంటే అసలు గిట్టదు. తరచుగా రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అన్న చిరంజీవి వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉండటం కూడా పవన్, నాగ బాబులకు ఇష్టం ఉండదు. చిరంజీవి మాత్రం సీఎం జగన్ తో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు.
మరోవైపు చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనసేన పార్టీ ఫండ్ వసూళ్లకు వాడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంత కాలంగా నిర్మాత బన్నీ వాసు మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్న బోయ సునీత.. ఈ కామెంట్స్ చేశారు. అనంతపూర్ లో జరుగుతున్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పాసులు కావాలంటే జనసేన పార్టీకి విరాళాలు ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారని బోయ సునీత వెల్లడించారు. మరి ఆమె ఆరోపణల్లో నిజమెంతో తెలియదు.
అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ మూవీలో క్యామియో రోల్ చేస్తున్నారు. నయనతార పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. మలయాళ రీమేక్ ని ఆ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తుండగా చిరంజీవిపై ట్రోల్స్ మొదలయ్యాయి.