అమ్మ నాకు దైవంతో సమానం... వైరల్ అవుతున్న మహేష్ ఎమోషనల్ వర్డ్స్
సూపర్ స్టార్ మహేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లిగారైన ఇందిరా దేవి మరణించారు. ఈ సందర్భంగా గతంలో మహేష్ అమ్మ గురించి చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ వైరల్ అవుతున్నాయి.
ఏడాది వ్యవధిలో మహేష్ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. 2022 జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృత్యువాతపడ్డారు. అనారోగ్యం కారణంగా రమేష్ బాబు మృతి చెందారు. రమేష్ బాబు మృతి మరవకముందే తల్లి ఇందిరా దేవి దూరమయ్యారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి సెప్టెంబర్ 28న తెల్లవారు ఝామున కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇందిరా దేవి మరణంతో పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ కి అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి మరణం ఆయన్ని ఎంతగానో కృంగదీసింది. కాగా గతంలో మహేష్ తల్లి గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహర్షి మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ మాట్లాడుతూ... అమ్మ నాకు దేవుడితో సమానం. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు అమ్మ దగ్గరకు వెళ్లి ఒక కాఫీ తాగుతాను. ఆ కాఫీ నాకు దేవుని ప్రసాదంతో సమానం. ఆమె దీవెనలు నాకు ఎంతో అవసరం. అందుకే ఈ మూవీ సక్సెస్ ప్రపంచంలో ఉన్న తల్లులు అందరికీ అంకితం'' అంటూ మహేష్ చెప్పుకొచ్చారు.
మహేష్ ఆనాడు చెప్పిన మాటలు ఇందిరా దేవి పట్ల ప్రేమను చాటుతున్నాయి. అమ్మ అంటే ఆయనకు ఎంత సెంటిమెంటో తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఇందిరా దేవి మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. నేడు మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరగనున్నాయి. చిన్న కుమారుడు మహేష్ ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి చేయనున్నాడు.