మోహన్‌లాల్‌ వరుసగా రెండు రూ.200కోట్ల సినిమాలు అందించి మలయాళ సినిమాకి ప్రాణం పోశారు. అంతేకాదు బాక్సాఫీసు వద్ద తన రేంజ్‌ ఏంటో చూపించారు. ఇప్పుడు ఆయన పారితోషికం పెంచారు. 

మోహన్‌ లాల్‌ ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించారు. ఆయన నటించిన `ఎల్‌2ః ఎంపురాన్‌`, `తుడరుమ్‌` చిత్రాలు వరుసగా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించాయి. `తుడరుమ్‌` మూవీ ఫైనల్‌గా రూ.237కోట్లు రాబట్టి అత్యధిక వసూలు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 

పారితోషికం పెంచిన మోహన్‌ లాల్‌

వరుసగా రెండు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో మోహన్‌లాల్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. మార్కెట్‌ కూడా విస్తరించింది. ఆయన చిత్రాలకు బిజినెస్‌ బాగా పెరిగింది. దీంతో ఆయన డిమాండ్‌ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో మోహన్‌లాల్‌ కూడా పారితోషికం పెంచినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు పది, పదిహేను కోట్ల మధ్యలో పారితోషికం తీసుకునే వారట. 

ఇప్పుడు రూ.20కోట్లకుపైగా డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. డిమాండ్‌ చేయడం కంటే నిర్మాతలే అంత మొత్తం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు మోహన్‌ లాల్‌ పారితోషికం రూ.20-25కోట్లకి పెరిగిందని సమాచారం. 

దిలీప్‌ కుమార్‌ సినిమాలో మోహన్‌ లాల్‌ గెస్ట్ రోల్‌

ఇదిలా ఉంటే మోహన్‌ లాల్‌ సోలో హీరోగా కాకుండా మరో హీరో దిలీప్‌ కుమార్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పారితోషికం చర్చనీయాంశం అవుతుంది. దిలీప్‌ కుమార్‌ హీరోగా `భభబ` పేరుతో సినిమా రూపొందుతుంది. 

`భయం భక్తి బహుమానం`(భభబ) అసలు పేరు. దీంతో ఈ మూవీని ప్రకటించినప్పట్నుంచే క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. టైటిల్‌ మాత్రమే కాదు, ఇందులో ముఖ్య పాత్రలో మోహన్‌ లాల్‌ నటించడంతో మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

`భ.భ.బ`లో మోహన్‌ లాల్‌ పాత్ర కన్ఫమ్‌

మోహన్ లాల్-దిలీప్ కాంబినేషన్ అధికారికంగా ప్రకటించకపోయినా, చాలా మంది నటులు దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. తన కొత్త సినిమా గురించి నటుడు బైజు సంతోష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో `భ.భ.బ` గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

"ఇది చాలా పెద్ద సినిమా. `ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ` అనేది ఒక పెద్ద బాణసంచా ముందు వచ్చే చిన్న శాంపిల్ మాత్రమే. లాల్ సార్ `భ.భ.బ` లో గెస్ట్ రోల్ చేస్తున్నారు" అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

18 రోజులకు రూ.12కోట్ల పారితోషికం

అదే సమయంలో `భ.భ.బ`లో మోహన్ లాల్ పారితోషికం రూ.12 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ కి 18 రోజుల షూటింగ్ ఉంటుందని కూడా చెబుతున్నారు. కేవలం గెస్ట్ రోల్‌కే ఇంత మొత్తం పారితోషికం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

 ఇక ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ జూలై 4న వస్తుందని దిలీప్ ఇటీవలే ప్రకటించారు.

`భయం భక్తి బహుమానం` సినిమాకి నూరిన్ షెరీఫ్, ఫాహిమ్ సఫర్ జంట కథ రాస్తున్నారు. వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న `భ.భ.బ` సినిమాని ​గోకులం మూవీస్ నిర్మిస్తోంది.