ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న మోహన్బాబు, మంచు లక్ష్మి.. `అగ్ని నక్షత్రం` తండ్రీకూతుళ్ల విశ్వరూపం
తెలుగు తెరపై మొదటిసారి మంచు మోహన్బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి కలిసి తెరని పంచుకోబోతున్నారు. అందుకు `అగ్ని నక్షత్రం` సినిమా వేదిక కాబోతుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, కలెక్షన్ కింగ్గా పేరుతెచ్చుకున్న మంచు మోహన్బాబు సినిమాల జోరు పెంచారు. మొన్నటి వరకు ఆచితూచి సినిమాలు చేసిన ఆయనిప్పుడు స్పీడ్ పెంచినట్టున్నాడు. ఇటీవల `సన్నాఫ్ ఇండియా`తో మెరిసిన మోహన్బాబు ఇప్పుడు మరోసినిమా చేయబోతున్నారు. తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఫస్ట్ టైమ్ ఆయన సినిమా చేయబోతుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో `అగ్ని నక్షత్రం` అనే సినిమా రాబోతుంది.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డా.మంచు మోహన్బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్లో వస్తోన్న `అగ్ని నక్షత్రం` సినిమాకి వారే నిర్మాతలు కావడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రీతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సముద్రఖని, మలయాళ నటుడు సిద్ధిక్, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు శుక్రవారం(జులై 1న) ఈ చిత్ర టైటిల్ని విడుదల చేశారు.
ఈ సినిమాకి సంబంధించిన డిటెయిల్స్ వెల్లడిస్తూ, `తండ్రీకూతుళ్లైన మోహన్బాబు, మంచు లక్ష్మి మొదటి సారిగా కలిసి నటించడం విశేషం. మంచి ముహూర్తాన `అగ్ని నక్షత్ర` టైటిల్ని రివీల్ చేశాం. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. పోలీస్ స్టోరీతో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన సిద్ధిక్ విలన్గా నటిస్తున్నారు. చైత్ర శుక్ల మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. విశ్వంత్ హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమాకి ఎడిటర్గా మధురెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్గా లిజో కె జోష్, గోకుల్ భారతి కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉంది` అని తెలిపింది యూనిట్. మోహన్బాబు చివరగా `సన్నాఫ్ ఇండియా`లో నటించగా, మంచు లక్ష్మికి నటిగా చాలా గ్యాప్ వచ్చింది. ఆమెకిది ఓ రకంగా కమ్ బ్యాక్ లాంటి చిత్రమని చెప్పొచ్చు. తండ్రీ కూతుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇందులో వీరిద్దరు కలిసి విశ్వరూపం చూపించడం ఖాయమంటున్నారు అభిమానులు.